రూ.500 కోట్ల భారీ ప్రాజెక్టులో జూనియర్ శ్రీదేవి....

శుక్రవారం, 10 ఆగస్టు 2018 (10:51 IST)
వెండితెర అందాల సుందరి శ్రీదేవి. ఆమె వారసురాలిగా వెండితెర అరంగేట్రం చేసిన ఆమె కుమార్తె జాన్వీ కపూర్.. తన తొలి చిత్రం "దఢక్‌"తోనే తనేంటో నిరూపించుకుంది. ఆ తర్వాత జాన్వీ కపూర్‌కు అనేక ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా, తెలుగులో విజయ్ దేవరకొండతో బెస్ట్ ఆఫర్ వచ్చింది. అయితే, ఈ ఆఫర్‌ను ఆమె సున్నితంగా తిరస్కరించారు. కానీ, జాన్వీ తన తదుపరి చిత్రాన్ని ఎవరితో చేస్తుందా అనే ఆసక్తి నెలకొంది.
 
ఈ నేపథ్యంలో ఓ బడా ఆఫర్ ఈ అమ్మడిని వరించింది. కరణ్ జోహార్ దర్శక నిర్మాణంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ చిత్రంలో జాన్వీ కపూర్‌కి ఛాన్స్ దక్కింది. "తక్త్" అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఆయన సరసన కరీనా కపూర్ కథానాయికగా నటిస్తుంది. 
 
అలాగే, అలియా భట్‌తో పాటు విక్కీ కౌశల్, అనీల్ కపూర్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విక్కీ కౌశల్‌కి జతగా జాన్వీ కపూర్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు విడుదల అవుతుంది అనే వివరాలు ప్రస్తుతానికి సస్పెన్స్‌లో ఉంది. 
 
మరోవైపు, "తక్త్" అనే టైటిల్‌ని బట్టి చూస్తుంటే ఇదేదో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాగా అర్థమవుతోంది. 'తక్త్' అంటే బెంచ్ లేదా సీట్ అని అర్థం. 'సింహాసనం' కోసం పోరాడే వారియర్ సినిమాగా ఈ చిత్రంగా తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు