గతంలో ఎన్టిఆర్, హరికష్ణ మధ్య పెద్దగా సాన్నిహిత్యం కనిపించేది కాదు. ఇద్దరం కలవడం తక్కువుండేది. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. ఎన్టీఆర్ సినిమాల ఆడియో వేడుకల్లో హరికష్ణ కనిపిస్తున్నాడు. బుధవారం రాత్రి కళ్యాణ్ రామ్ 'ఇజం' ఆడియో వేడుకలో తండ్రీకొడుకుల ఆప్యాయత అందరి ఆకర్షించింది.
తన తండ్రిని కలిసి చాలా కాలమైందో ఏంటో.. ఆడిటోరియంలోకి వచ్చి తండ్రిని చూడగానే చాలా ఉత్సాహపడిపోయాడు ఎన్టిఆర్. తండ్రిని హత్తుకుని ఆయన్ని సోఫాలో కూర్చోబెట్టి.. ఆయన ముందు కింద మోకాళ్లపై కూర్చుని.. ఆయన చేతులు పట్టుకుని చాలా ఆప్యాయంగా మాట్లాడాడు. హరికృష్ణ సోదరుడు రామకృష్ణ కూడా ఆనందంలో పాలుపంచుకున్నాడు. ఆయనతోనూ ఎన్టీఆర్ చాలా ఆప్యాయంగా మాట్లాడాడు. ఇద్దరి మధ్యన హరికృష్ణ కూర్చుని సంధానకర్తగా వ్యవహరించాడు. తండ్రితో చాలాసేపు నవ్వుతూ మాట్లాడాడు ఎన్టిఆర్.
అనంతరం వేదికపై హరికష్ణ మాట్లాడుతూ... నా వయసు 60. ఈ జీవితంలో ఎవరూ పొందలేని, అనుభవించలేని ఆనంద సమయాలను చూశాను. నందమూరి రామారావుగారి దగ్గర 30 ఏళ్లు పనిచేశా. ఆయనతో నాకున్న అనుభవాలు హిమాలయ శిఖరాలను మించాయి. సినిమా రంగంలో ఆయనతో ఎన్నో విజయాలు చూశాను. రాజకీయాల్లో పార్టీ పెట్టి పోరాటం చేసి గెలిచాం. వెలకట్టలేని వీరాభిమానులు ఇవాళ మా సొంతం. ఎవరూ తస్కరించలేనిది అభిమానం.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నా బిడ్డలకు ఆ అభిమానాన్ని పంచుతున్నారు. నా 59వ ఏట జూనియర్ 'టెంపర్' హిట్ ఇచ్చాడు. కల్యాణ్రామ్ 'పటాస్' ఇచ్చాడు. నా 60వ ఏట జూనియర్ 'జనతా గ్యారేజ్' హిట్ ఇచ్చాడు. కల్యాణ్ ఇప్పుడు 'ఇజం'తో ముందుకు రాబోతున్నాడు. మా నాన్న ఆశీస్సులు పిల్లలకున్నాయి. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటను నా ఇద్దరు పిల్లలూ గుర్తుంచుకున్నారు. నా పెద్ద కుమారుడు తన తమ్ముళ్లు తప్పకుండా హిట్లు తీస్తారని నాతో చెప్పేవాడు. అతను లేకపోయినా అతను నమ్మిన మాట ఉంది' అని అన్నారు.