సందేశం కూడిన 'కంచె': క్లాసికల్ మూవీగా అదరగొట్టేసింది.. రివ్యూ రిపోర్ట్

శుక్రవారం, 23 అక్టోబరు 2015 (11:22 IST)
తారాగణం: వరుణ్‌ తేజ్‌, ప్రగ్యా జైస్వాల్‌, నికితిన్‌ ధీర్‌,  శ్రీనివాస్‌ అవసరాల, పోసాని, గొల్లపూడి తదితరులు 
సంగీతం: చిరంతన్‌ భట్‌, సినిమాటోగ్రఫీ: వి.ఎస్‌.జ్ఞానశేఖర్‌, ఎడిటింగ్‌: సూరజ్‌ జగ్‌తాప్‌, రామకృష్ణ అర్రం, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, సమర్పణ: బిబో శ్రీనివాస్‌, నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్‌రెడ్డి, రచన, దర్శకత్వం: క్రిష్‌. 
 
రొటీన్‌గా హీరో ఇమేజ్‌ను తీసుకుని కథలు అల్లుకుని సినిమాలు తీసే దర్శకులకు భిన్నంగా వాస్తవ సంఘటలను ఆధారంగా చేసుకునే దర్శకుడు క్రిష్‌.. (రాధాకృష్ణ). ప్రతి సినిమాలోనూ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా తను ఏదైతే చెప్పదలుచుకున్నాడో దానిమీదే దృష్టి పెట్టి సినిమాలు తీసే క్రిష్‌ మరోసారి తన పంథాలో, తన ఆలోచనలకు అనుగుణంగా తీసిన సినిమా కంచె. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఒక సైనికుడి కథను తీసుకొని దానికి ప్రేమకథను, సామాజిక అంశాలను కూడా జోడించి చేసిన సినిమా ఇది. ఈ సినిమా ట్రైలర్స్‌లోని వార్‌ ఎపిసోడ్స్‌ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిన మాట వాస్తవం. దాన్ని ఎలా తీశాడో చూద్దాం.
 
బుక్ మై షో కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
 
కథ: 
దూపాటి హరిబాబు (వరుణ్‌తేజ్‌) తాత దేవరకొండ అనే గ్రామంలో మంగళవాయిద్యాలు వాయించే వృత్తి. ఆ ఊరిలోని రాచకొండ సంస్థానానికి చెందిన సీత(ప్రగ్యా జైస్వాల్‌), హరిబాబు చెన్నపట్నంలో చదువుకుంటూ వుంటారు. వీళ్ళద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. అది రెండవ ప్రపంచ యుద్ధకాలం. యుద్ధంలో బ్రిటీష్‌ తరఫున రాయల్‌ ఇండియన్‌ ఆర్మీకి చెందిన 75 వేల మంది పాల్గొంటారు. అందులో దేవరకొండ గ్రామం నుంచి వచ్చిన కల్నల్‌ ఈశ్వరప్రసాద్‌ (నికితిన్‌ ధీర్‌) కెప్టెన్‌ దూపాటి హరిబాబు కూడా వుంటారు. వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. కారణం తక్కువ కులం వాడు.. తన సోదరి సీతను ప్రేమించడమే. ఇక యుద్ధంలో ఇద్దరూ పాల్గొంటారు. శత్రుదేశమైన జర్మనీ సేనలకు ఈశ్వర్‌ చిక్కుతాడు. హరిబాబు తప్పించుకుని.. వారిని, అక్కడి యూదుజాతుల్ని ఎలా కాపాడాడు? చివరికి ఏమయింది? అనేది కథ.
 
నటీనటులు పెర్‌ఫార్మెన్స్‌
దూపాటి హరిబాబుగా వరుణ్‌తేజ్‌ సైనికుడిగా సరిపోయాడు. అందులో ఎమోషన్స్‌ పెద్దగా పలకడానికి ఏమీ వుండదు. బాగా సూటయ్యాడు. కథ ప్రకారం హీరోయిజాన్ని చూపించుకునే అవకాశం ఎక్కడా వుండదు. ఇక ఈశ్వరప్రసాద్‌గా చేసిన నికితిన్‌ ధీర్‌ ఓకే అనిపించాడు. సీతగా ప్రగ్యా జైస్వాల్‌ లుక్స్‌ వైజ్‌గా ఓకే కానీ పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఎక్కడా నేచురాలిటీ కనిపించదు. మిగతా ఆర్టిస్టులు కూడా బాగానే చేశారు. సినిమాలో కనిపించే క్యారెక్టర్లు పర్వాలేదు. ఊరిలో సీత బామ్మగా షావుకారి జానకి.. తదితరులు నటించారు. 
 
విశ్లేషణ:
ఒక ప్రేమ కథ, ఒక ఊరి కథ, రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ఎపిసోడ్స్‌. ఓ పక్క యుద్ధం జరుగుతూ వుంటుంది. మధ్య మధ్య హీరో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్స్‌ వస్తుంటాయి. అనేవి స్క్రీన్‌ప్లే కొత్తగా వున్నాయి. అయితే ఇవి నేటి తరానికి పెద్దగా అర్థంకావు. ఐమాక్స్‌ ప్రేక్షకులకు నచ్చేవి. కామన్‌మేన్‌కు.. ఈ వార్‌ ఏమిటో... అనే సందిగ్థలో పడేస్తుంది. దీనికి కారణం.. ఒకరకంగా ఇప్పటి సినిమాలే.. హీరో యిజం.. హీరోయిన్‌. గ్లామర్‌.. పంచ్ డైలాగ్‌లు. క్లబ్‌ డాన్సులకు అలవాటు పడిపోయి.. ఇలాంటి దేశభక్తి చిత్రాలు వెంటనే జీర్ణించుకోలేరు. దేశమంతా మనుషులే... దేవరకొండ అనే ఊరిలోనూ మనుషులే.. కానీ కిందితరగతి పై తరగతి అనే తేడాతో అధికారం కోసం ఊరి జనాల మధ్య చిచ్చుపెట్టి.. పదవిని కాపాడుకోవడం.. ఊరి చరిత్ర... ప్రపంచ చరిత్ర కూడా అలాగే వుంది. జర్మనీ నియంత హిట్లర్‌ తక్కువ జాతి అయిన యూదుల్ని ఊచకోతలు కోసి ప్రజల్ని భయపెట్టి ప్రపంచాన్ని శాసించడమే. ఇదీ చరిత్ర. ఎక్కడా చూసినా ఇంతే.
 
అందుకే శ్రీశ్రీ అన్నట్లు.. ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటూ ఓ డైలాగ్‌ చెప్పిస్తాడు. కథ 2వ ప్రపంచ యుద్ధం.. శ్రీశ్రీ అప్పుడు రాశాడా? అన్న డౌట్‌ కూడా వచ్చింది. కానీ ఆయన అప్పుడే రాసినట్లు తెలుస్తోంది. ఇలా దేశం కోసం సైన్యం చేతిలో చిక్కిన హీరో తన వారిని కాపాడుకుని చివరికి బలి కావడం ముగింపు. ఇలాంటి ముగింపులు తెలుగు ప్రేక్షకులకు సరిపడవు. ఎంత హీరో అయినా వందమందిని చేతితో చంపాలి. అప్పుడే వారికి కనెక్ట్‌ అవుతుంది. అందుకే ఈ చిత్రం సందేశాత్మకంగా చిత్రమే. ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారో కష్టమే.. ఇక  ప్రతి సన్నివేశాన్నీ బలమైన, బరువైన డైలాగ్స్‌తో రక్తి కట్టించాలని చూసిన ఈ చిత్రానికి ఇంతకంటే ఏమీ చేయలేరు. కథలో క్లారిటీలేదు.
 
చెప్పాలనుకున్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పలేకపోయాడు. అలాగే హీరో, హీరోయిన్‌ల మధ్య నడిచే ప్రేమ సన్నివేశాలు చాలా నాటకీయంగా వుంటాయి తప్ప ఎక్కడా సహజత్వం అనేది గోచరించదు. వాళ్ళు చెప్పే డైలాగ్స్‌ కూడా పుస్తకాల్లో చదువుకోవడానికి బాగుంటాయి తప్ప ప్రేక్షకులకు ఏమాత్రం రుచించవు. రాయల్‌ ఇండియన్‌ ఆర్మీ జర్మనీ సైన్యానికి లొంగిపోయిన తర్వాత కల్నల్‌ ఈశ్వరప్రసాద్‌ని బందీగా తీసుకెళ్ళిపోతారు. అతన్ని రక్షించుకోవడానికి హీరో బృందం బయల్దేరుతుంది. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు, ఎంతోమందితో యుద్ధం.
 
ఇదంతా కథకు సంబంధం లేకుండా ఒకదాని వెంట ఒక సీన్‌ వచ్చేస్తుంటుంది. ఆ సీన్స్‌లో కొన్ని ఎమోషన్స్‌, కొంత సెంటిమెంట్‌ని పండించే ప్రయత్నం చేశాడు. ముగింపు మాత్రం కంట తడిపెట్టిస్తుంది. హీరోయిన్‌ అప్పటికే చనిపోయిందని తెలుసు.కానీ హీరో ఎందుకు లెటర్లు రాస్తున్నాడో అర్థంకాదు. ఇది హాలీవుడ్‌ చిత్రాల్లో అయితే ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు.. చూసిన మనవారు బాగా తీశారంటారు. కానీ తెలుగులో వచ్చింది గనుక ఏదో చేశాడు అనిపిస్తుంది. మొత్తంగా క్రిష్‌ చక్కటి ప్రయత్నం చేశాడు. చిరంతన్‌ ఇచ్చిన మ్యూజిక్‌ గురించి చెప్పాలంటే పాటల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. 
 
బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం చాలా భారీ స్థాయిలో ఇచ్చాడు. కొన్ని సీన్స్‌కి కొంతైనా గ్రాండియర్‌ వచ్చిందంటే దానికి జ్ఞానశేఖర్‌ ఫోటోగ్రఫీ, చిరంతన్‌ పనితనమే కారణం. క్రిష్‌ గురించి చెప్పాలంటే ఈ సినిమా మొత్తంలో వార్‌ ఎపిసోడ్‌ని మాత్రం ఇప్పటివరకు తెలుగులో ఎవరూ అలా తియ్యలేకపోయారు అనేంతగా కష్టపడి తీశాడు. వార్‌ ఎపిసోడ్స్‌ వరకు అతని టేకింగ్‌ హాలీవుడ్‌ రేంజ్‌లోనే వుంది. అయితే ఆ ఎపిసోడ్‌ నిడివి కూడా ఎక్కువ కావడంతో కొంత బోర్‌ కూడా కొట్టింది. రెండు గంటల సినిమా మనకు రెండున్నర గంటల సేపు చూస్తున్నట్టు అనిపిస్తుంది. 
 
ముకుందతో హీరోగా పరిచయమైన వరుణ్‌ తేజ్‌కి రెండో సినిమానే ప్రయోగాత్మకంగా చేయడం గొప్ప విషయం. ఒకప్పుడు చిరంజీవి 'రుద్రవీణ' తీశాడు. సినిమా బాగుంది. కమర్షియల్‌గా వర్కవుట్‌ కాలేదు. ఇది కూడా అంతే కావచ్చు.
                                
బుక్ మై షో కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 
 
రేటింగ్‌: 3/5

వెబ్దునియా పై చదవండి