కంగనా రనౌత్‌కు బెదిరింపులు - "వై ప్లస్" కేటగిరీ సెక్యూరిటీ - షాకు థ్యాంక్స్

సోమవారం, 7 సెప్టెంబరు 2020 (13:05 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్‌కు శివసేన పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్‌కు మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. వీరిద్దరూ సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలో కంగనాను ముంబైలోకి రాకుండా అడ్డుకుంటామని శివసేన హెచ్చరించింది. అయితే, ఈ నెల 9వ తేదీన ముంబైకు వస్తున్నానని, ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యే సమయం కూడా చెబుతానని, దమ్మున్న మగాడు ఎవడో వచ్చి అడ్డుకోవాలంటూ కంగనా ప్రతిసవాల్ విసిరింది. 
 
ఈ క్రమంలో ముంబైకు వచ్చే కంగనా రనౌత్‌కు వై కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించింది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెకు ఓ ప‌ర్స‌న‌ల్ సెక్యూర్టీ ఆఫీస‌ర్‌తో పాటు 11 మంది పోలీసులు భ‌ద్ర‌త‌గా ఉంటార‌ు. 
 
కంగ‌నాకు క‌ల్పించే భ‌ద్ర‌త‌లో క‌మాండోలు కూడా ఉండ‌నున్న‌ట్లు హోంశాఖ వ‌ర్గాలు వెల్లడించాయి. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కూడా ముంబైలో కంగ‌నాకు భ‌ద్ర‌త క‌ల్పించే యోచ‌న‌లో ఉన్న‌ది. కంగ‌నాకు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ఆమె సోద‌రి, తండ్రి త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ట్లు హిమాచ‌ల్ సీఎం జైరాం థాకూర్ తెలిపారు. 
 
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో కంగ‌నా ర‌నౌత్ ముంబై పోలీసుల విచార‌ణ తీరును త‌ప్పుప‌ట్టింది. బాలీవుడ్‌లో కొంత మందిపై ప్ర‌ముఖుల‌పై కూడా ఘాటు కామెంట్లు చేసింది. ముంబైని పీవోకేతో పోలిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఆ వ్యాఖ్య‌ల‌ను శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ త‌ప్పుప‌ట్టారు. 
 
ముంబై, మ‌హారాష్ట్ర ప‌ట్ల చేసిన కామెంట్ల‌పై క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని సంజ‌య్ రౌత్ డిమాండ్ చేశారు.  ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల‌యుద్ధం నడిచింది. అయితే ఈనెల 9వ తేదీన ముంబైలో ఓ కార్య‌క్ర‌మంలో కంగ‌నా పాల్గోనాల్సి ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో కంగ‌నాకు ప్ర‌త్యేక భ‌ద్ర‌తను కేంద్రం కల్పించింది. 

తనకు భద్రతను కల్పించిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కంగన ధన్యవాదాలు తెలిపారు. ఒక మహిళను ఆయన గౌరవించారని చెప్పారు. ఏదైనా సమస్య పట్ల నిర్భయంగా గొంతుకను వినిపిస్తున్న వ్యక్తిని ఏ శక్తీ ఆపలేదనే విషయం దీని వల్ల అర్థమవుతోందని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు