మరో వర్థమాన నటుడు సూసైడ్ - కన్నడనాట విషాదం!!

బుధవారం, 8 జులై 2020 (19:10 IST)
మరో వర్థమాన నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఇంకా మరచిపోకముందే.. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సుశీల్ గౌడ ఆత్మహత్య చేసుకున్నాడు. తన స్వస్థలం మండ్యలో ఆయన ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సుశీల్ వయసు 30 ఏళ్లు. బుల్లితెరపై సక్సెస్ ఫుల్ నటుడిగా పేరుతెచ్చుకున్న సుశీల్... సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. 
 
తాజాగా హీరో దునియా విజయ్ నటించిన చిత్రంలో పోలీసు పాత్రలో నటించాడు. అయితే, ఆ చిత్రం ఇంకా విడుదల కాకముందే ఆత్మహత్యకు పాల్పడటం అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది.
 
మరోవైపు సుశీల్ ఆత్మహత్యపై దునియా విజయ్ స్పందించాడు. సుశీల్‌ను తొలిసారి చూసినప్పుడు హీరో కావాల్సిన వ్యక్తి అని అనుకున్నానని చెప్పారు. సినీ పరిశ్రమలో నిలదొక్కుకుంటాడని భావించానని, కానీ అందరినీ వదిలి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఆత్మహత్య దేనికీ సమాధానం కాదని చెప్పాడు. కరోనా భయం వల్లే కాక.. జీవించడానికి డబ్బు దొరకదనే నమ్మకాన్ని కోల్పోవడం కూడా ఆత్మహత్యలకు కారణమవుతోందని అన్నాడు. కష్ట సమయంలో అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు