కౌశల్ చెప్పిన రాజు-పులి కథ.. ఇక కౌశల్ సైన్యం ఏం చేస్తుందో?

సోమవారం, 24 సెప్టెంబరు 2018 (11:23 IST)
బిగ్ బాస్‌లో ఒకే వారం మిగిలి ఉన్నందున తమ తమ క్యాంపెయిన్‌ను మొదలు పెట్టి, ప్రేక్షకులు తమలు ఎందుకు ఓటు వేయాలో, మిగిలినవారితో పోలిస్తే తాను ఎందుకు బెస్ట్ అనే విషయాలను వివరిస్తూ క్యాంపెయినింగ్ ప్రారంభించాలని నాని హౌస్‌మేట్స్‌కు చెప్పారు. దీంతో మొదటగా కౌశల్, నాని శైలిలో పిట్ట కథతో ప్రారంభించారు.
 
అనగనగా ఓ రాజ్యం. ఆ రాజ్యానికి ఓ రాజు. తనకో కూతురు ఉంది. కానీ ఆ రాజుకి వారసుడు లేడు. సో ఆ రాజు ఆలోచించి మంత్రిని పిలిచి ఒక జట్టును తయారు చేసి, ఆ జట్టుకు మా నక్షత్రం అని పేరు పెట్టి తీసుకురమ్మంటాడు. రాజు చెప్పినట్లుగా మంత్రి 16 మందిని వెతికిపట్టి తీసుకువచ్చి రాజు ముందు ప్రవేశ పెడతారు.
 
ఆ వీరుల ముందు ఓ పులి బోను ఉంచుతారు, అందులో ఉన్న పులిని బయటకు విడిచిపెట్టిన తరువాత ఎవరైతే దాన్ని బంధించి పట్టుకుంటారో వాళ్లకి ఈ రాజ్యాన్ని బహుమతిగా ఇవ్వడంతో పాటుగా తన కూతుర్ని ఇచ్చి పట్టాభిషేకం చేస్తానని ప్రకటిస్తారు మహారాజు. ఆ జట్టులో ఒక్కడు తప్ప మిగిలిన 15 మంది ఒక జట్టుగా ఏర్పడి ఆ పులిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఆ మిగిలిన ఒక్కడి ధ్యాసంతా ఆ పులి, దాని కన్ను మీదే ఉంటుంది. 
 
కసి పట్టుదలతో ఆ పులిని ఎలాగైనా వేటాడి పట్టుకోవాలని పోరాడుతుంటాడు. ఇంతలో ఇది గమనించిన మిగిలిన వేటగాళ్లు మనం పులిని తర్వాత వేటాడవచ్చు, ముందు ఆ వేటగాడిని లేకుండా చేద్దామని నిర్ణయించుకుని ఆ వేటగాడిపై వరుస బాణాలు వదులుతారు. ఆ బాణాలు తగిలి ఒరిగిపోతాడు. రక్తం కారుతున్నా సరే తన పోరాటాన్ని ఆపకుండా కొనసాగిస్తుంటాడు. 
 
జనమంతా చూస్తుండగా మధ్యలోంచి తన రెండేళ్ల పాప లల్లి పాపా లే... పోరాడు అంటూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఆమెతో పాటు జనం కూడా లేచి పోరాడాలని ప్రోత్సహిస్తారు. ఇది చూసిన మిగతా వేటగాళ్లు కూడా లే లే అంటూ కేకలు వేస్తారు. ఈ స్థైర్యంతో గుండెల్లో గుచ్చుకున్న బాణాలను సైతం లెక్కచేయకుండా పులిని పట్టుకుంటాడు. దీంతో రాజు అతనికి పట్టాభిషేకం చేస్తారంటూ కథను ముగించి, ఇందులో ఆ వేటగాడు తానే అని, మిగిలిన వేటగాళ్లు కంటెస్టెంట్స్ అంటూ ఎప్పట్లాగే తను ఒంటరివాడినన్న భావన జనం మర్చిపోకుండా ఉండేలా గుర్తు చేయడానికి మంచి ఎత్తు వేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు