మద్రాసుకు వెళ్లిన తొలి రోజే మేకప్ వేసుకున్న శతాధిక చిత్రాల దర్శకుడు

శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (15:52 IST)
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరు. టాలీవుడ్ ఓ అగ్ర దర్శకుడిని కోల్పోయింది. అనారోగ్యంతో బాధపడుతూ.. కోడి రామకృష్ణ కన్నుమూశారు. చదువుతున్నప్పుడే నాటకాల్లో నటించే కోడి.. తొలుత దర్శకుడిగా కాకుండా సినీ నటుడిగా ఎదుగుదామని ప్రయత్నించారు. డిగ్రీ పూర్తికాకుండానే పలు సినిమా దర్శకులకు తన ఫోటోలు పంపేవారు. 
 
అయితే తాత మనవడు సినిమా చూశాకా, దాసరి నారాయణరావులా దర్శకుడు కావాలన్న ఆలోచన బలపడింది. కానీ తొలి నుంచీ నటనపై ఉన్న ఆసక్తిని వదులుకోలేదు. దర్శకత్వ శాఖలో పనిచేయడానికి ముందే డిగ్రీ విద్యార్థిగా ఉండగానే రాధమ్మ పెళ్లిలో నటించారు. హీరోయిన్‌కు అసిస్టెంట్‌గా ఈ సినిమాలో కోడి నటించారు. 
 
ఆ పాత్ర ప్యాచ్ వర్క్ ఎవరో డూప్‌తో జరుగుతుండగా అప్పుడే కోడి రామకృష్ణ మద్రాసు రావడంతో ఆయనకే మేకప్ వేసి నటింపజేశారు. దాసరి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తూనే ఆయా సినిమాల్లో చిన్నాపెద్దా పాత్రల్లో నటిస్తూండేవారు. స్వర్గం నరకం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు అభిమాన సంఘం నాయకునిగా ప్రారంభించి ఎవరికి వారే యమునా తీరే వంటి చిత్రాల్లోనూ నటించారు. అంతేగాకుండా మద్రాసు వచ్చిన తొలిరోజే మేకప్ వేసుకుని నటించారు.
 
దర్శకునిగా గుర్తింపు పొందాక నటునిగా కూడా ప్రయత్నించారు. తొలిసారిగా 'మా ఇంటికి రండి' అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. సుహాసిని కథానాయిక. ఆపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. 
 
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, తరంగిణి, ముద్దుల మావయ్య, మా పల్లెలో గోపాలుడు, ముద్దుల కృష్ణయ్య, తలంబ్రాలు, అమ్మోరు, అరుంధతి, దేవి, శత్రువు, దేవి పుత్రుడు, శ్రీనివాస కళ్యాణం, పోరాటం, పెళ్ళి వంటి వందకి పైగా సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు