కరోనా కేసుల పెరుగుదలపై మహేష్ ఆందోళన - ముఖ మాస్కులే శ్రీరామరక్ష

సోమవారం, 29 జూన్ 2020 (16:06 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంపై టాలీవుడ్ హీరో మహేష్ బాబు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. లాక్డౌన్ సండలింపులు అమల్లోకి వచ్చిన తర్వాతే ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ముఖానికి మాస్కులు ధరించడమే ఏకైక శరణ్యమని ప్రిన్స్ మహేష్ బాబు చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, లాక్డౌన్ సడలించినప్పటి నుంచి కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సమయంలో మనల్ని మనం కాపాడుకోవడమేకాకుండా, మన చుట్టూ ఉన్నవాళ్లను కూడా కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు. 
 
బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని స్పష్టంచేశారు. మీ చుట్టుపక్కల పరిస్థితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, భద్రతా చర్యలతో పాటు, భౌతికదూరం కూడా పాటించాలని సూచించారు.
 
ఇప్పటివరకు మీ ఫోన్‌లో ఆరోగ్యసేతు యాప్ లేకపోతే ఇకనైనా డౌన్‌లోడ్ చేసుకోవాలని మహేశ్ బాబు పేర్కొన్నారు. మీకు సమీపంలో ఎవరైనా కరోనా నిర్ధారణ అయిన రోగులు ఉన్నట్టయితే ఈ యాప్ మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది అని వెల్లడించారు. 
 
అంతేకాదు, ఈ యాప్‌తో మీరు అత్యవసర వైద్య సహాయం కూడా అందుకోవచ్చని వివరించారు. మనందరం క్షేమంగా ఉండాలి, ఈ విషయం గుర్తెరిగి బాధ్యతగా మసలుకుందాం అంటూ మహేశ్ బాబు ఇన్ స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు