ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో మా అధ్యక్షుడు మంచు విష్ణు భేటీ

మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (13:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డితో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, సినీ హీరో మంచు విష్ణు మంగళవారం సమావేశమవుతున్నారు. ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన అగ్రహీరోలు చిరంజీవి, ప్రభాస్, మహేష్‌లతో పాటు దర్శకులు రాజమౌళి, కొరటాలశివ తదితరులు సమావేశమయ్యారు. ఇపుడు సీఎం జగన్‌తో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా, మా అధ్యక్షుడుగా మంచు విష్ణు ఎన్నికైన తర్వాత సీఎం జగన్‌ను కలవడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, ఇటీవల సీఎం జగన్‌ను కలిసి సినీ పెద్దలు చిత్రపరిశ్రమలోని సమస్యల పరిష్కారంతో పాటు సినిమా టిక్కెట్ల ధరలను పెంచాలని కోరారు. ఆ సమయంలో మంచు ఫ్యామిలీకి చెందిన కుటుంబ సభ్యులు ఎవరూ హాజరుకాలేదు. 
 
ఆ తర్వాత హైదరాబాద్‌లోని హీరో మోహన్ బాబు ఇంటికి ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వెళ్లి ప్రత్యేకంగా భేటీ కావడం చర్చనీయాంశమైంది. పైకి మాత్రం మర్యాదపూర్వకంగా జరిగిందని చెపుతున్నప్పటికీ ఇందులో చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించినట్టు తెలుస్తుంది. ఇపుడు మంచు విష్ణు భేటీ కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు