అలా చేస్తే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుతున్నట్లే : చిరంజీవి వార్నింగ్

సోమవారం, 20 ఆగస్టు 2018 (10:18 IST)
ఎంతో సౌమ్యుడిగా కనిపించే మెగాస్టార్ చిరంజీవికి కోపమొచ్చింది. దీంతో ఆయన గట్టిగా హెచ్చరించారు. అలా ప్రవర్తిస్తే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతున్నట్టే అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన "గీతగోవిందం" చిత్రం సక్సెస్ మీట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిరంజీవి వచ్చారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'గీతగోవిందం చిత్రంలోని పలు సీన్లు విడుదలకు ముందే లీకైందని అరవింద్‌గారు చెప్పినప్పుడు 'మీరేం వర్రీ కాకండీ. మా తమ్ముడు పవన్‌కల్యాణ్‌ 'అత్తారింటికి దారేది' సినిమా కూడా ఇలాగే లీకైంది. అది విజయానికి ఆటంకం కాదు. సెంటిమెంట్‌ అనుకోండి' అని ఊరట కలిగించడానికే నాలుగు మాటలు చెప్పినట్టు తెలిపారు. 
 
నిజానికి రూ.కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమాను స్నేహితులకు చూపించడానికి కుర్రతనంతో కొందరు లీక్‌ చేయడం ఎంతవరకూ సబబు? ఇదేం న్యాయం? చిత్ర పరిశ్రమ ఎందరికో తల్లిలాంటిది. ఇక్కడ పని చేసే వ్యక్తులు చిత్రాన్ని దొంగిలించి షేర్‌ చేస్తున్నారంటే కొన్ని కోట్లను దొంగతనం చేస్తున్నట్టే. ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నా... ఎవరైనా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే... తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుతున్నట్లే అని గుర్తుంచుకోండి అంటూ గట్టిగా హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు