మెగా మేనల్లుడి మరో ప్రాజెక్ట్... కథ విన్న చిరంజీవి ఏమన్నారంటే..?

బుధవారం, 29 మే 2019 (18:44 IST)
మెగా కాంపౌండ్‌లోని హీరోలలో చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మొదట్లో మంచి హిట్‌లు అందుకున్నప్పటికీ, కొద్దికాలంగా వరుస పరాజయాలను చవిచూస్తున్నారు. కెరీర్ సెట్ అవుతుందనే దశలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక లాభం లేదనుకున్న చిరంజీవి అల్లుడి కోసం రంగంలోకి దిగారట. అరడజను పైగా సినిమాల ఫ్లాపుల బరువు మోస్తున్న తేజు ఇటీవల నటించి విడుదలైన చిత్రలహరి కాస్త ఫరవాలేదనిపించింది. 
 
ఈ తరుణంలో సినిమాల ఎంపిక విషయంలో సరైన మార్గనిర్దేశం లేకపోవడం వల్లనే వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయనే వాదన వినిపిస్తోంది. ఇకనైనా ప్రాజెక్టుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్న సాయిధరమ్ తేజ్ కథలను ఎంపిక చేసుకునే విషయంలో మామ చిరంజీవి సాయం కోరారట. దీంతో రంగంలోకి దిగిన చిరంజీవి డైరెక్టర్ మారుతి చెప్పిన కథ విని ఓకే చెప్పారని సమాచారం.
 
సాయి ధరమ్ తేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మారుతి సిద్ధం చేసిన కథను చిరంజీవి, అల్లు అరవింద్‌లకు వినిపించగా, కథ బాగా నచ్చడంతో ఈ ఇద్దరూ పచ్చజెండా ఊపారని సమాచారం. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్లపై ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్, హీరోయిన్‌గా మాళవిక శర్మను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 
 
ఈ అందాలభామ ఇప్పటికే రవితేజ హీరోగా నటించిన నేల టిక్కెట్టు సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటికీ ఆ తర్వాత సరైన అవకాశాలు లేక సోషల్ మీడియాపై దృష్టి పెట్టి ఈ ఛాన్స్ సాధించింది. మరి వీరిద్దరికీ ఈ సినిమా ఎలాంటి అనుభూతి మిగులుస్తుందో చూడాలి మరి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు