న్యూమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన నసీరుద్దీన్ షా

గురువారం, 1 జులై 2021 (13:29 IST)
ఇటీవలి కాలంలో బాలీవుడ్ నటులు వరుసగా ఆస్పత్రి పాలవుతున్నారు. తాజాగా బాలీవుడ్  సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ఆస్పత్రిలో చేరారు. 70 ఏళ్ల నసీరుద్దీన్ న్యూమోనియాతో బాధపడుతున్నారు. 
 
గత రెండు రోజులుగా న్యుమోనియాతో బాధపడుతుండటంతో ఆయనను మంగళవారం ఆస్పత్రిలో చేర్చినట్టు ఆయన భార్య రత్న పాథక్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు.
 
కాగా, ఊపిరితిత్తుల్లో ప్యాచ్ కారణంగా ఆయన బాధ పడుతున్నారని.. చికిత్సకు నసీరుద్దీన్ బాగా స్పందిస్తున్నారని ఆయన మేనేజర్ తెలిపారు. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 
 
మరోవైపు, ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ముంబైలోని హిందుజా హాస్పిటల్‌లో చేరారు. 
 
ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఇదే సమస్యతో ఆయన ఆసుపత్రిలో చేరారు. రెండు వారాల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
 
అయితే మరోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. దిలీప్ కుమార్ వయసు 98 సంవత్సరాలు. వయసు ఎక్కువ కావడంతో ముందస్తు జాగ్రత్తగా ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చారు. 
 
ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.
 
ఇదిలావుంటే, బాలీవుడ్ నటి మందిరా బేడీ భర్త బుధవారం తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. గుండెపోటు కారణంగా ఆయన చనిపోయిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు