ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్షేమం- కొనసాగుతున్న చికిత్స

శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (17:10 IST)
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈనెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర,  బహిరంగసభలో పాల్గొని హైదరాబాద్‌కు చేరుకున్న తరవాత నలతగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఫలితాలు నెగిటివ్ అని వచ్చాయి.

అయినప్పటికీ డాక్టర్ల సూచన మేరకు తన వ్యవసాయక్షేత్రంలోనే క్వారంటైన్‌కు వెళ్లారు. అయితే అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దీంతో రెండు రోజుల కిందట మరోసారి కోవిడ్ పరీక్షలు జరుపగా పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ళ సుమన్ హైదరాబాద్‌కు వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చికిత్స ప్రారంభించారు. అవసరమైన ఇతర పరీక్షలన్నీ చేయించారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నెమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు.

అపోలో నుంచి ఒక వైద్య బృందం
శ్రీ చిరంజీవి గారు, వదిన శ్రీమతి సురేఖ గారితోపాటు శ్రీ రామ్ చరణ్, శ్రీమతి ఉపాసన ఎప్పటికప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యవసాయ క్షేత్రంలోనే  చికిత్సకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరీక్షించింది.

అపోలో ఆస్పత్రికి చెందిన డాక్టర్ శ్యామ్, డాక్టర్ సుబ్బారెడ్డి - శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. జ్వరం ఊపిరితిత్తుల్లోని నెమ్ము, ఒళ్లునొప్పులు తగ్గడానికి మందులు వాడుతున్నారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.
 
తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన శ్రీ సుమన్ పాండిచ్చేరిలో వైద్య విద్యను అభ్యసించారు. కాకినాడకు చెందిన ప్రముఖులు శ్రీ తోట హనుమంతరావు గారి మనవరాలు డా. కావ్యను డా.సుమన్ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి డా. సుమన్ అత్యంత ఆప్తులు. ఫ్యామిలీ మెడికల్ అడ్వైజర్‌గా ఎప్పటికప్పుడు తగిన సలహాలు ఇస్తుంటారు. గత వారం రోజులుగా డా.సుమన్ - శ్రీ పవన్ కల్యాణ్ గారు వెన్నంటే ఉండి తగిన వైద్యసేవలు అందిస్తున్నారు. నిర్మాత శ్రీ నాగ వంశీ గత వారం రోజులుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట ఉంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తూ, వైద్య సేవలను సమన్వయం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు