పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం "ఓజీ" సినిమా షూటింగుకు మళ్లీ బ్రేకులుపడ్డాయి. ఈ చిత్రంలో విలన్ పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ డెంగ్యూబారిన పడటంతో ఈ చిత్రం షూటింగ్కు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబైలో సాగుతోంది. ఇందులో పాల్గొనేందుకు హీరో పవన్ కళ్యాణ్ సైతం ముంబైలో ఉన్నారు. ఇపుడు చిత్ర ప్రధాన విలన్ అనారోగ్యం బారినపడటంతో సినిమా షూటింగును వారం రోజుల పాటు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అస్వస్థతకు లోనైన ఇమ్రాన్ హష్మీకి వైద్య పరీక్షలు చేయించుకోగా, ఆయనకు డెంగ్యూ ఫీవర్ అని తేలింది. దీంతో వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని దర్శకుడు సుజిత్, నిర్మాత డీవీవీ దానయ్యలకు తెలుపగా, వారు హీరో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్.. ఇమ్రాన్ హష్మీ కోలుకున్న తర్వాతే షూటింగ్ పూర్తి చేద్దామని చెప్పడంతో ఈ సినిమా షూటింగ్ను తాత్కాలికంగా వాయిదా వేశారు.
కాగా, యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తున్న విషయం తెల్సిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని దసరా కానుకంగా సెప్టెంబరు 25వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. అయితే, చిత్రీకరణకు ఎదరవుతున్న అంవాతరాల వల్ల సినిమాను ముందుగా ప్రకటించిన తేదీలో విడుదల చేయడం అనుమానమేననే టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్న విషయం తెల్సిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్లు మూవీపై భారీ అంచనాలను పెంచేశాయి.