పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు ప్రత్యేక సంచిక ఆస్థి మేలుకొలుపు

డీవీ

శనివారం, 31 ఆగస్టు 2024 (14:48 IST)
Pawan Kalyan Birthday Special Edition Asthi Melukolupu
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘మార్క్‌ మీడియా’ నుండి ‘ఆస్థి మేలుకొలుపు’ ప్రత్యేక సంచికను విడుదల చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లక్ష కాపీల పంపిణీకి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న ఈ సంచికను రామోజీ ఫిలింసిటీలో గురువారం సాయంత్రం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా ఆయన పవన్‌ కళ్యాణ్‌ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. పవన్‌ కళ్యాణ్‌ గారిపై ప్రచురించిన ఈ ప్రత్యేక సంచికను అభిమానులందరూ తప్పకుండా చదవాలని కోరారు.  ఈ ప్రత్యేక సంచికలో పవన్‌ కళ్యాణ్‌ గారి ఉద్ధేశాలు, రాష్ట్రంలో, దేశంలో ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన పడినటువంటి  శ్రమ, భవిష్యత్తు తరాల అభివృద్ధి పట్ల ఆయన వ్యూహాలు తదితర అంశాలతో సుమారు 25 మంది సీనియర్‌ జర్నలిస్టులు రాసిన ఆర్టికల్స్‌తో రూపొందుతున్న ఈ పత్రికను ప్రతి ఒక్కరూ చదవాలని ఆయన కోరారు. 
 
అనంతరం జర్నలిస్ట్‌ శ్రీ ప్రభు మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీపై ఎడిటర్‌ అండ్‌ పబ్లిషర్‌ పెచ్చెట్టి మురళీరామకృష్ణా రెడ్డి ప్రత్యేక అభిమానంతో రూపొందించిన ఈ పత్రికను ప్రతి ఒక్కరూ చదవాలని కోరారు.
 
పబ్లిషర్‌ పెచ్చెట్టి మురళీరామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్‌గారిపై ఉన్న ప్రేమ, అభిమానంతో ఈ పత్రికను మీ ముందుకు తీసురావడం జరిగిందని, యువత ఆయన గురించి మరింత తెలుసుకొని అనుసరించాల్సి విషయాలు ఎన్నో ఉన్నాయని, భవిష్యత్‌ తరాలపట్ల ఆయన పడుతున్న తపన చేస్తున్నటువంటి వ్యూహరచన తెలుసుకొని అనుసరించాలని, ఆయనలా ఆలోచించే నాయకులు బహు అదురు అని, ఆయనకు ప్రతి ఒక్కరూ తమ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.  
ఎంతో మంది శ్రమకోర్చి రూపొందిన ఈ పత్రికలో తను భాగస్వామిని అవుతానని పవన్‌ కళ్యాణ్‌ అభిమాని వీడియో గ్రాఫర్‌ చంద్ర తక్షణ స్పందనతో రూ. 20 వేలు విరాళం ప్రకటించారు. హీరో సాయి ధరమ్‌ తేజ్‌ అయనను ప్రత్యేకంగా అభిమానించారు.
 
ఈ కార్యక్రమంలో సముద్రాల సురేంద్రరావు, పరిటాల రాంబాబు, మధు, రాయుడు గణపతి, ఫిలిం డైరెక్టర్‌ ప్రకాష్‌ పులిజాల ఇతరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు