సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కత్తి మహేశ్ మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కత్తి మహేశ్ స్వగ్రామంలో సోమవారం అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ… పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
కత్తి మహేశ్ ప్రమాదం జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు మంద కృష్ణ మాదిగ. రోడ్డు ప్రమాదంలో కారు కుడిభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయినప్పటికీ… డ్రైవింగ్ చేస్తున్న సురేశ్ స్వల్పగాయాలతో బయటపడ్డాడని.. ఎడమ వైపు కూర్చొన్న మహేశ్కు తీవ్ర గాయాలవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కత్తి మహేశ్కు చాలా మంది శత్రువులు ఉన్నారని.. గతంలో దాడులు, కొన్ని సంఘటనలు దీనికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయన్నారు.
మరోవైపు సినీ క్రిటిక్ కత్తి మహేష్ మృతిపై తమకు అనుమానాలున్నాయని ఆయన తండ్రి ఓబులేషు చెప్పారు. మహేష్ చనిపోయిన విషయాన్ని తమకు చెప్పకుండానే బయటకు వెల్లడించారని ఆయన తెలిపారు. కత్తి మహేష్ మృతిపై న్యాయ విచారణ జరగాలని…ప్రస్తుతం తన ఆరోగ్యం సహకరించడం లేదన్నారు ఓబులేషు. అలాగే ఇప్పుడు న్యాయం కోసం పోరాడే పరిస్థితి లేదన్నారు.