ప్రపంచ వ్యాప్తంగా రజినీకాంత్ మేనియా కొనసాగుతోంది. ఆయన తాజా చిత్రం 'కబాలి' విడుదల తేదీ సమీపిస్తుండటంతో రజినీ అభిమానుల్లో హంగామా మొదలైంది. రజినీ చిత్రం విడుదల కాకుండా బ్రేక్ వేయాలంటూ మద్రాస్ హైకోర్టు దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీంతో చెన్నై నగర వ్యాప్తంగా రజినీకాంత్ 'కబాలి' చిత్ర పోస్టర్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి.
ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ‘కబాలి... డా’ అనే డైలాగ్నే ఉచ్ఛరిస్తున్నారు. ‘నిప్పురా.. తాకరా..’ అంటూ కబాలి సిగ్నేచర్ పాటే ఆలపిస్తున్నారు. విమానాలపై నుంచి ఎయిర్ ఓచర్ ప్యాక్లపై కూడా కబాలి బొమ్మలే దర్శనమిస్తున్నాయి. అలాగే, గ్రామీణ ప్రాంతాల నుంచి మెట్రో నగరాల వరకు ఎక్కడ చూసినా కబాలిపైనే చర్చ. రజినీ సినిమా ఇంత వసూళ్లు చేస్తుంది.. అంత వసూళ్లు చేస్తుందన్న చర్చలు, బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి.
బెంగళూరుకు చెందిన ఓపస్ వాటర్ప్రూఫింగ్.. చెన్నైకు చెందిన ఫిండస్ కంపెనీలు కబాలీ విడుదలయ్యే జూలై 22ను సెలవుగా ప్రకటించేశాయి. సెలవే కాదు.. సిబ్బందికి ఉచితంగా టికెట్లూ ఇస్తున్నాయి. కాగా.. ఈ సినిమాను 22న థియేటర్లలో విడుదల చేయడంతోపాటు, బెంగళూరులోని ప్రముఖ ఫైవ్స్టార్ హోటళ్లలోనూ ప్రదర్శించనున్నారు. రోజూ 3 షోలు వేయనున్నారు.