అలాంటి సినిమాలోనే సుధీర్‌తో కలిసి నటిస్తా.. రష్మీగౌతమ్

మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (11:46 IST)
సుడిగాలి సుధీర్ ప్రస్తుతం సాఫ్ట్ వేర్ సుధీర్‌గా మారిపోయాడు. వెండితెరపై హీరోగా మెరిశాడు. ప్రస్తుతం సుధీర్ అండ్ టీమ్ కలిసి త్రీ మంకీస్ అంటూ వెండితెరపై హంగామా చేసేందుకు సిద్ధం అయిపోయారు. వీరు ముగ్గురూ కల్సి చేస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. ఫిబ్రవరి 6న ఈ 3 మంకీస్ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి.
 
త్రీ మంకీస్ సినిమా ప్రమోషన్‌లో యాంకర్ రష్మీ గౌతమ్ కూడా తళుక్కుమంటోంది. ఓ ఇంటర్వ్యూలో రష్మీ గౌతమ్ మాట్లాడుతూ.. సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్ ముగ్గురూ త్రీ మంకీస్ సినిమాలో అద్భుతంగా చేశారని అంటోంది. అంతేకాదు ఈ సినిమాలో వారు ముగ్గురూ ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్టైన్ చేయనున్నారని అంటోంది. ఇక సుధీర్‌తో తన బంధం గురించి చెబుతూ అతను తనకు మంచి స్నేహితుడని వెల్లడించింది. 
 
ఇదిలా ఉండగా సుదీర్ నటించిన సాఫ్ట్ వేర్ సుదీర్ సినిమాలో తనకి మొదట హీరోయిన్‌గా అవకాశం వచ్చిందనీ, అయితే, ఖాళీ లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయానని వెల్లడించింది. 
 
ఇక సుధీర్‌కు తనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుందని.. వారి అంచనాలకు ధీటుగా సినిమా తీయాలని.. అలాంటి సినిమాలోనే సుధీర్‌తో తాను కలిసి నటిస్తానని రష్మీ గౌతమ్ వెల్లడించింది. కచ్చితంగా తామిద్దరం కలిసి నటిస్తాం. అయితే ఆ సినిమా లెవల్ ముఖ్యమని చెప్పుకొచ్చింది. అలాంటి స్క్రిప్ట్ కోసమే వేచి చూస్తున్నట్లు రష్మీ గౌతమ్ తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు