ఆ సినిమాకు ఇదే సరైన సమయం : రాజమౌళి

ఆదివారం, 23 ఆగస్టు 2020 (15:21 IST)
"బాహుబలి" చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరో ప్రభాస్. ఈ చిత్రం తర్వాత ఆయన నటించిన 'సాహో' చిత్రం కూడా టెక్నికల్ వ్యాల్యూస్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అయితే, నిర్మాతకు మాత్రం కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వరుసగా మూడు చిత్రాల్లో కమిట్ అయ్యాడు. అందులో ఒకటి "రాధేశ్యామ్" కాగా, మరొకటి వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థ నిర్మించే చిత్రం. మూడోది బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్న "ఆదిపురుష్". ఈ మూడు కూడా అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలే.
 
అయితే, 'ఆదిపురుష్' చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించనున్నారు. ఇందులో సీత పాత్రధారిణి ఎవరన్న విషయం తెలియాల్సివుంది. ఇదిలావుంటే 'ఆదిపురుష్' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. దీనికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. 
 
ఈ చిత్రం పోస్టర్‌పై దర్శక దిగ్గజం ఎస్ఎస్. రాజమౌళి స్పందించారు. 'ఆదిపురుష్' చిత్రం పోస్టర్‌ను తాను ఎపుడో చూశానని చెప్పాడు. పైగా ఈ పోస్టర్ అద్భుతంగా ఉందన్నారు. ఈ సినిమా రావడానికి ఇదే సరైన సమయం. అయోధ్యలో ఇటీవలె భూమి పూజ జరిగింది. దేశమంతా రాముడి గురించి చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో రాముడి మీద సినిమా వస్తే చాలా బాగుంటుంది. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ మరింత పెరుగుతుంది అని చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు