అవినీతికి పాల్పడితే ప్రధాని అయినా జైలుకు వెళ్లాల్సిందే : అమిత్ షా

ఠాగూర్

సోమవారం, 25 ఆగస్టు 2025 (14:35 IST)
తప్పు చేసి లేక అవినీతికి పాల్పడి జైలుకెళితే సాక్షాత్ దేశ ప్రధానమంత్రి అయినా జైలుకు వెళ్లాల్సిందేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జైలుపాలై జైలులో కూర్చొని పాలన చేస్తామంటే ఇకపై కుదరదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా జైలు నుంచే పరిపాల చేయడం మంచి విషయమేనా? అని ప్రశ్నించారు. ఇలాంటి పద్దతి మన ప్రజాస్వామ్యానికి అది మర్యాదపూర్వకంగా ఉంటుందా? అంటూ విపక్ష పార్టీలపై ఆయన విరుచుకుపడ్డారు. 
 
130వ రాజ్యాంగ సవరణ బిల్లుతో సహా పలు అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విపక్షాలు ఇప్పటికీ కూడా జైలుకు వెళితే సులభంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలమని అనుకుంటున్నారు. వారు జైలులోనే సీఎం, పీఎం అధికారిక నివాసాలుగా మార్చేస్తారు. అపుడు డీజీపీ, చీఫ్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీ వంటి ఉన్నతాధికారులు జైలు నుంచే ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సిద్ధాంతాలను మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. జైలు నుంచే ప్రభుత్వాలను నడిపే పరిస్థితి మన దేశంలో రాకూడదన్నారు.
 
ప్రధానిగానీ, ముఖ్యమంత్రిగానీ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఏ నేత అయినా సరే ఏదైనా కేసులో అరెస్టయితే 30 రోజుల్లో బెయిల్ పొందాలి. లేదంటే తమతమ పదవులకు రాజీనామా చేయాలి, అలా చేయకపోతే చట్టమే వారిని తప్పించేలా 130వ రాజ్యాంగ సవరణను తీసుకొస్తున్నాం. చట్టమేదైనా ప్రభుత్వం, ప్రతిపక్షానికి ఒకేలా అమలవుతుందన్నారు. 
 
ఈ నిబంధన ప్రధాని పదవికి కూడా వర్తించేలా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని సవరణలో చేర్చారు. ఆయనకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రధాని జైలుకెళ్తే ఆయన కూడా పదవి రాజీనామా చేయాల్సిందేనని అమిత్ షా వెల్లడించారు. ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ సవరణను తీసుకొస్తే దానిపై అభ్యంతరాలు లేవనెత్తే హక్కు అందరికీ ఉంటుందన్నారు. అంతేగానీ, పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం లేకుండా ఆందోళనలు చేస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు