టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోండి : సుప్రీంకోర్టు

వరుణ్

సోమవారం, 29 జనవరి 2024 (17:12 IST)
ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన తెలుగు సినీ దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ఆయనపై క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సిందేనంటూ ఆదేశించింది. తనకు చెందిన "శ్రీమంతుడు" కథను కాపీ కొట్టారంటూ ప్రముఖ రచయిత శరత్ చంద్ర దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. పైగా, హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు విచారణను ఎదుర్కోవాల్సిందేనంటూ అపెక్స్ కోర్టు తేల్చి చెప్పింది. 
 
మహేష్ బాబు - శృతిహాసన్ జంటగా కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'శ్రీమంతుడు'. ఈ చిత్రం ఘన విజయం సాధించి, కలెక్షన్లపరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అయితే, స్వాతి పత్రికలో వచ్చిన తన కథను కాపీ చేసి ఈ చిత్రాన్ని తెరక్కించారంటూ రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశారు జారీచేసింది. 
 
దీంతో నాంపల్లి కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలంటూ కొరటాల శివ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో సాగిన విచారణలో కూడా ఈ కథను కాపీ కొట్టినట్టు నిరూపించే ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారు. ఈ మేరకు రచయిత సంఘం కూడా హైకోర్టుకు నివేదికను ఇచ్చింది. వీటిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు... నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించగా, దర్శకుడు కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
ఈ పిటిషన్‌పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం కొరటాల శివ పిటిషన్‌ను కొట్టివేసింది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది. దీంతో కొరటాల శివకు చిక్కులు ఎదురుకానున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు