సినీ పరిశ్రమలో ఎవరి స్వార్థం వారిది.. ఉదయ్ కిరణ్ మృతికీ అదే కారణం: శివాజీ రాజా

బుధవారం, 28 జూన్ 2017 (16:22 IST)
సినీ పరిశ్రమ ఎవరూ బాధలో ఉన్నా పట్టించుకోదని.. ఇక్కడ ఎవరి స్వార్థం వారిదేనని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ రాజా  వ్యాఖ్యానించారు. యంగ్ హీరోగా ఓ వెలుగు వెలిగి.. ఆపై కష్టాల్లో చిక్కుకుని.. ఆత్మహత్యకు పాల్పడిన ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం కూడా సినీ పరిశ్రమేనని శివాజీరాజా విమర్శించారు. 
 
ఉదయ్ కిరణ్ స్మారకంగా ప్రతీ ఏడాది షార్ట్ ఫిలిమ్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జరిగిన షార్ట్ ఫిలిమ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ.. నాడు కష్టాల్లో ఉన్న ఉదయ్ కిరణ్‌ని సినీ పరిశ్రమ ఆదుకుని వుంటే.. ఈ రోజు ఉదయ్ కిరణ్ మన మధ్య ఉండేవాడన్నారు. 
 
ఉదయ్ కిరణ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండ్ ఎదిగిన ఉదయ్ కిరణ్.. అర్థాంతంగా ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించడం దురదృష్టకరమని శివాజీరాజా ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఎవరి స్వార్థం వారు చూసుకోకుండా సినీ ఇండస్ట్రీలో ఒకరికొకరు కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసుకుంటూ వెళ్తే.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవని శివాజీ రాజా సూచించారు.

వెబ్దునియా పై చదవండి