మహేష్ బాబుపై పోలీసు కేసు పెట్టారా..? తమ్మారెడ్డి ఏమంటున్నారు...?

బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (09:17 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుపై పోలీసు కేసు పెట్టారనే వార్త విని షాకవుతున్నారా..? అప్పుడప్పుడూ ఇలాంటి తెలియని నిజాలు సీనియర్ ఇండస్ట్రీ పెద్దలు చెప్తుంటే అభిమానులు కూడా షాక్ అవుతుంటారు. ఇప్పుడు కూడా ఇలాంటి నిజమే బయటికి వచ్చింది. అదే మహేష్ బాబుపై పోలీసు కేస్ పెట్టడం.. ఆయన స్టేషన్ చుట్టూ తిరగడం. ఇదెప్పుడు జరిగింది అనే అనుమానం రావచ్చు. 
 
సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేసాడు. ఓ సినిమా పైరసీ విషయంలో మహేష్ బాబు ముందుకొచ్చి నిలబడ్డాడని.. రివర్స్‌లో ఆయనపైనే కేసు పెట్టారు. అప్పుడు ఆయన స్టేషన్స్ చుట్టూ తిరగలేక చచ్చాడు పాపం అంటూ చెప్పుకొచ్చాడు తమ్మారెడ్డి. 
 
అప్పట్లో తన సినిమా విషయంలో వరంగల్ వెళ్లి ఓ ఇంట్లో మహేష్ బాబు పైరసీ సీడిని పట్టుకున్నాడని.. కానీ చివరికి ఆయనపైనే రివర్స్ కేసు పెడితే స్టేషన్స్ చుట్టూ తిరగలేక అలిసిపోయాడని చెప్పాడు తమ్మారెడ్డి. ధైర్యంగా ముందుకొచ్చినపుడు కేసులు పెడుతుంటే ఎవరు మాత్రం ఎందుకొస్తారంటున్నాడు ఈయన. ఇప్పటికైనా పైరసీ రాయుళ్ల ఆట కట్టించాలంటే ఇండస్ట్రీ అంతా కలిసిరావాలంటున్నాడు. 
 
అర్జున్ సినిమా సమయంలోనే మహేష్ బాబు ఇలా రోడ్డెక్కాడు. ఆయనకు తోడుగా అప్పుడు పవన్ కళ్యాణ్ సహా చాలా మంది ఉన్నారు. బహుశా అప్పుడే పోలీసు కేసు కూడా అయ్యుంటుందని చెప్తున్నారు విశ్లేషకులు.
 
ఇకపోతే రవితేజ నటించి విడుదలైన క్రాక్ బ్లాక్‌బస్టర్ అయింది. దాదాపు 38 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది ఈ సినిమా. దీన్ని ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నారు. ఓటిటి విడుదల సందర్భంగా ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు ఆహా.
 
ఇదిలా ఉంటే ఒరిజినల్ ప్రింట్ వచ్చిన తర్వాత కచ్చితంగా దాన్ని పైరసీ చేయడానికి సిద్ధంగా ఉంటాయి కొన్ని సైట్లు. ఇప్పటికే వందల సైట్లు మూయించేసినా.. పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి పైరసీ సైట్లు. దాంతో వాటిని ఆపడం ఎవరితరం కావడం లేదు. అయినా కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పాడు తమ్మారెడ్డి భరద్వాజ.
 
ఇప్పుడు క్రాక్ సినిమా పైరసీ చేసినా తనకు వచ్చే నష్టమేం లేదని.. కానీ సినిమా ఇండస్ట్రీ బతకాలని.. ఈ రోజు వేరే సినిమాకు జరిగింది రేపు తన సినిమాకు జరగదనే గ్యారెంటీ లేదు కదా అంటున్నాడు తమ్మారెడ్డి. అందుకే వచ్చానని.. ఇదివరకు అలా రావడానికి కూడా ధైర్యం సరిపోయేది కాదని కానీ ఆహా వాళ్లు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడంతో సంతోషంగా ఉందంటున్నాడు తమ్మారెడ్డి. 
 
పైరసీని కంట్రోల్ చేయడం అంటే చిన్న విషయం కాదని.. పోలీసులు మర్డర్లు జరక్కుండా ఆపుతున్నారు కానీ పూర్తిగా ఆగిపోలేదు కదా ఇది కూడా అంతే అంటున్నాడు భరద్వాజ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు