తెలుగు సినీ నటుడు - క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు ఇకలేరు..

సోమవారం, 25 అక్టోబరు 2021 (07:30 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు వయసు 64 యేళ్లు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 
 
రాజబాబు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని నరసాపురపేట. చినప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు.
 
1995లో ‘ఊరికి మొనగాడు’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారి, భరత్ అనే నేను తదితర చిత్రాల్లో నటించారు. మొత్తంగా 62 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. 
 
ముఖ్యంగా, రాజబాబు వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి ల సౌ స్రవంతి వంటి బుల్లితెర సీరియళ్లలోనూ నటించారు. అమ్మ సీరియల్‌లోని పాత్రకు 2005లో నంది అవార్డు కూడా అందుకుని బుల్లితెర ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు