పెట్రోల్ ధరను రోజూ పెంచడమే... ఇదే ఆయిల్ కంపెనీల దినచర్య

శుక్రవారం, 22 అక్టోబరు 2021 (08:28 IST)
దేశంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశ ప్రజలు గగ్గోలు పెడుతున్నప్పటికీ.. ఆయిల్ కంపెనీలు మాత్రం బేఖాతర్ అంటున్నాయి. ఈ ధరలను రోజురోజుకూ పెంచుకుంటూ పోతున్నాయి. తగ్గింపు అనే మాటే తమ డిక్షనరీలో లేదన్నట్టుగా ఆయిల్ కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజల్ భారం రోజురోజుకూ ఎక్కువైపోతోంది. 
 
పెరుగుతున్న పెట్రో ధ‌ర‌లు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచ‌రీ కూడా దాటేశాయి. ఇక తాజాగా మరోసారి పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలు పెరిగిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు, లీటర్ డీజిల్‌‌పై 35 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.89 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.62కు చేరింది.
 
ఇకపోతే, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.78 చేరగా.. డీజిల్ ధర రూ.103.63 కు చేరింది. కోల్‌ కత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45 చేరగా.. డీజిల్ ధర రూ.98.73 కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.92 చేరగా.. డీజిల్ ధర రూ.99.92కు చేరింది.
 
ఇక హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.18 చేరగా.. డీజిల్ ధర రూ.104.32కు చేరింది. ఇటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో పెట్రోల్, డీజిల్‌ ధరలు సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. విజయవాడ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ ధర రూ.112.90 కాగా డీజిల్‌ ధర రూ.105.42గా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు