ఇండియన్-2 సెట్స్‌లో క్రేన్ ప్రమాదం... ముగ్గురి మృతి.. శంకర్‌కు తీవ్ర గాయాలు

గురువారం, 20 ఫిబ్రవరి 2020 (09:41 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్-2. ఈ చిత్రం షూటింగ్ శరవేరంగా సాగుతోంది. అయితే, ఈ చిత్రం షూటింగ్‌లో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ముఖ్యంగా భారీ క్రేన్ ఒకటి విరిగిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో చిత్ర దర్శకుడు ఎస్. శంకర్‌తో పాటు.. ఇద్దరు అసిస్టెంట్లతో సహా మొత్తం పది మందికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. 
 
కమలహాసన్ ప్రధాన పాత్రలో నటించిన భారతీయుడు సినిమా 1996లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘భారతీయుడు-2’ పేరుతో సినిమా రూపొందిస్తున్నారు. కమల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్ తదితరులు నటిస్తున్నారు.
 
శంకర్ దర్శకత్వంలో శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతుండగా బుధవారం రాత్రి 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ ప్రమాదవశాత్తు తెగి కింది ఉన్న టెంట్‌పై పడింది. ఈ ఘటనలో టెంట్ కింద ఉన్న వారిలో శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ(34), సహాయకుడు చంద్రన్ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. గాయపడినవారిలో శంకర్ కూడా ఉన్నారు. 
 
క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ప్రమాదంపై స్పందించిన కమల్.. ఈ ఘటన తన మనసును కలచివేసిందన్నారు. ముగ్గురిని కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. వారి కన్నవారి కంటే తన బాధ ఎన్నో రెట్లు ఎక్కువని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు