భార్యను వదిలేశాను.. ఆస్తి అమ్మేశాను.. నీవే సర్వస్వం అనుకుంటే.. మొగుడు గుర్తుకొస్తున్నాడా?

మంగళవారం, 28 ఆగస్టు 2018 (14:58 IST)
ఏపీలో సంచలనం రేపిన బ్యూటీషియన్‌ పద్మపై హత్యాయత్నం కేసులో నిందితుడు బత్తుల నూతన కుమార్‌ విక్టర్‌ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను పోలీసులు గుర్తించారు. ఫలితంగా ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. పద్మపై అత్యంత పైశాచికంగా దాడి చేశాక అదృశ్యమైన నూతన కుమార్‌ గుంటూరు జిల్లాలోని నాదెండ్ల మండలం నుదురుపాడు వద్ద రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు. మరోవైపు, నూతన్ కుమార్ దాడిలో తీవ్రంగా గాయపడిన పద్మ.. ప్రాణాపాయ గండం నుంచి బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే, నూతన్ కుమార్ ఆత్మహత్యకు, సహజీవనం చేస్తూ వచ్చిన పద్మపై హత్యాయత్నానికిగల కారణాలను పోలీసులు గుర్తించారు.
 
వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులోని వెన్నవల్లివారిపేటకు చెందిన బత్తుల నూతన కుమార్‌ విక్టర్‌ ఎంబీఏ చదివాడు. ఏలూరులోని ద్విచక్ర వాహనాల షోరూంలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే పనిచేస్తున్న పల్లె పద్మతో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబధానికి దారితీసింది. ఆ తర్వాత వారిద్దరూ సహజీవనం చేస్తూ వచ్చారు.  
 
అయితే, అప్పటికే పెళ్లి అయిన నూతన్ కుమార్... భార్యను వదిలివేసి పద్మ చెంతకు వచ్చాడు. అయితే, గత కొన్ని రోజులుగా మనస్పర్ధలు రావడంతో నూతన్ కుమార్‌పై పద్మ పెదపాడు, హనుమాన్‌ జంక్షన్‌ పోలీస్‌ స్టేషన్లలో పద్మ ఫిర్యాదు కూడా చేసింది. అయితే, పద్మ వైఖరిలో మార్పు రావడం, పద్మ తిరిగి తన భర్త దగ్గరకు వెళ్లిపోవటానికి నిశ్చయించుకోవడం నూతన కుమార్‌ ఏమాత్రం జీర్ణించుకోలేక పోయాడు.
 
ఇదే విషయంపై వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఉన్న ఆస్తినంతా అమ్మేసి, భార్యను సైతం విడిచిపెట్టి పద్మ కోసం వస్తే, మళ్లీ ఆమె భర్త సూర్యనారాయణ దగ్గరకు వెళ్లిపోతుందనే అక్కసుతోనే ఈ దురాగతానికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే, పద్మ పూర్తి కోలుకుని, అసలు ఏం జరిగిందన్న విషయం చెబితేనే ఈ కేసులోని వాస్తవం తెలుస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు