గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్తో కుదుర్చుకున్న ఒప్పందం పట్ల ఐటీ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇది చారిత్రాత్మక మైలురాయి అని నారా లోకేష్ కొనియాడారు.
ఒకే రాజధానిని అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని లోకేష్ పునరుద్ఘాటించారు. ఎకరానికి రూ.5 లక్షల రాయితీ రేటుకు గూగుల్కు 300 ఎకరాల భూమిని కేటాయించారని ఆయన అన్నారు. ఎలక్ట్రానిక్స్ హబ్గా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ సమగ్ర వృద్ధి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
గత దశాబ్దంలో గ్రేటర్ వైజాగ్ వేగంగా అభివృద్ధి చెందింది. వ్యాపార వేగానికి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మారిందని నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. డేటా సెంటర్లతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెట్టుబడులు పెట్టే అనేక కంపెనీలు వైజాగ్లో కార్యకలాపాలను ఏర్పాటు చేస్తున్నాయని, లక్షకు పైగా కొత్త ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తున్నాయని నారా లోకేష్ హైలైట్ చేశారు.
2024లో గూగుల్తో సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్లతో ప్రారంభమైన చర్చలను నారా లోకేష్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
తుది ఒప్పందాన్ని గర్వకారణంగా అభివర్ణించారు. నవంబర్లో ఆంధ్రప్రదేశ్కు మరిన్ని శుభవార్తలు వస్తాయని, ఎందుకంటే బెంగళూరులో ఇబ్బందులు పడుతున్న అనేక కంపెనీలు ఇప్పుడు తమ కార్యకలాపాలను రాష్ట్రానికి మార్చాలని చూస్తున్నాయని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
ఇతర రాష్ట్రాలకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటే, ఆంధ్రప్రదేశ్కు డబుల్ ఇంజిన్ బుల్లెట్ రైలు ప్రభుత్వం ఉందని లోకేష్ తెలిపారు. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నామన్నారు. రాష్ట్ర పెట్టుబడి అనుకూల విధానాలను సమర్థిస్తూ.. 20 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
ఇందులో భాగంగా టీసీఎస్, కాగ్నిజెంట్లకు 99 పైసలకు భూమిని ఇవ్వడంలో తప్పేంటి? అని ప్రశ్నించారు. వైకాపా వ్యాప్తి చేసిన తప్పుడు సమాచారాన్ని ఇప్పుడు ఏ పెట్టుబడిదారుడు నమ్మడు. ఆంధ్రప్రదేశ్ తిరిగి ప్రపంచ పెట్టుబడి పటంలోకి వచ్చిందని నారా లోకేష్ వెల్లడించారు.