పరమకృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ బ్యానర్పై విజయలక్ష్మి వేలూరి నిర్మించిన టూ సోల్స్ విడుదలైంది. పరిమిత బడ్జెట్తో పాత కొత్త నటీనటుల కలయికతో కొత్త దర్శకుడు శ్రవణ్ తీశారు. త్రినాథ్ వర్మ, భావన సాగి హీరో హీరోయిన్లుగా నటించారు. రవితేజ మహదాస్యం, మౌమిక రెడ్డి ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథః
అఖిల్ (త్రినాథ్ వర్మ) కు తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. తల్లి గుర్తుగా ఉంగరం ఉంచుకుంటాడు. తండ్రి అంటే చికాకు. అందుకే సిక్కింలో ఒంటరిగా జీవిస్తుంటాడు. దానికి తోడు డ్రగ్స్ కు బానిస అవుతాడు. ప్రియా అనే అమ్మయిని ప్రేమిస్తాడు. ఆవిషయం చెప్పి పెళ్ళికి ఒప్పించాలని నిర్ణయించుకుంటాడు. ఆ విషయం చెప్పేందుకు ఇంటికెళ్లగా మరో అబ్బాయితో కలిసి కనిపిస్తుంది. దీంతో తాను మోసపోయానని తెలుసుకుని చంపేంత కోపంతో కత్తి తో వెళ్లి ధైర్యం లేక వెనుకడుగు వేస్తాడు. ధైర్యం కోసం డ్రగ్ తీసుకొని కారులో స్పీడ్ గా వెళుతూ ఈసారి తానే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తర్వాత లేచి చూస్తే తన బాడీ ఆసుపత్రి బెడ్ పై అపస్మారక స్థితిలో ఉంటుంది. తాను ఉన్నది ఆత్మ అని గ్రహిస్తాడు. అక్కడనుంచి బయటకు వస్తే తనలాగే యాక్సిడెంట్ అయిన ప్రియా(భావన సాగి) ఆత్మ బయట కూర్చొని ఉంటుంది. వీరిద్దరూ మాత్రమే ఒకరికొకరు కనిపిస్తారు. అఖిల్ అంటూ ఆమె పిలుస్తుంది. తనపేరు ప్రియా అనిచెపుతుంది. ఈ రెండు ఆత్మలు జీవితంలో ఏమి చేయలేక పోయామో అవి చేయాలని డిసైడ్ అవుతారు. అలా ప్రేమలో పడతారు. అఖిల్ తన ప్రేమకు ఆమెకు చెప్పే టైములో ఆత్మ విడిపోతుంది. ఆలా ఎందుకు జరిగింది. ప్రియా అప్పడు ఏమి చేసింది.. అనేదే కథ.
విశ్లేషణః
యాక్సిడెంట్తో ఆసుపత్రిలో పడి ఉన్న అమ్మాయి, అబ్బాయి ఆత్మలు కలుసుకోవడం, తమ గతాలను చెప్పుకోవడం, ఫ్రెండ్స్ గా మారి, ప్రేమ వరకు వెళ్లడమనేది ఓ కొత్త కాన్సెప్ట్. ఈ ఐడియా బాగుంది. ఇది ఈ సినిమాకి కొత్త దనాన్ని తీసుకొచ్చింది. మరోవైపు సిక్కిం లాంటి అందమైన ప్రాంతంలో జరిగే ప్రేమ కథ కావడంతో వీరి ప్రేమ కథతో పాటు, అక్కడి అందాలు అబ్బురపరుస్తుంటాయి. కనువిందు చేస్తాయి. ఓ వైపు మంచు, మరోవైపు కూల్గా సాగే ప్రేమ కథ ఆహ్లాదాన్ని పంచేలా ఉంటుంది. దర్శకుడికిది తొలి చిత్రమైనా బాగా డీల్ చేశాడు.
వీరిద్దరు ప్రేమలో పడటానికి ముందు ఈ ఇద్దరు ట్రావెల్ చేస్తూ తమ గతాన్ని రివీల్ చేసుకుంటూ వెళ్లిన తీరు ఆకట్టుకుంది. అయితే సినిమా మొత్తం స్లోగా సాగుతుంది. కథ ఎంత సేపు అక్కడక్కడే తిరిగినట్టుగా ఉంటుంది. కథలో ఎమోషన్స్ మిస్ అయ్యాయి. ఆయా పాత్రలు తీరుతెన్నులు డ్రెమాటిక్ గా అనిపిస్తుంటాయి. మొదటి భాగం మొత్తం ఏం జరుగుతుందో అర్థం కాదు. అంతా చిరాకు తెప్పిస్తుంది. దీంతో కన్ ఫ్యూజన్ క్రియేట్ అవుతూ బోర్ తెప్పిస్తుంది. హీరో పాత్ర తన గతాన్ని చెప్పేటప్పుడు ఆయా సీన్లు చూపించాల్సి ఉంది. ఎంత సేపు వాళ్లిద్దరే మాట్లాడుకోవడం చిరాకుపెట్టే అంశం. అయితే సినిమాలో ఎంటర్టైనర్ అస్సలు లేదు, అదే పెద్ద మైనస్.
ఇలాంటి కథను కమర్షియల్ గా రామ్, తమన్నా సినిమా గతంలో వచ్చింది. కానీ అది భిన్నమైంది. టూ సోల్స్ సినిమా కేవలం ప్రేమికులు ఎలా ఉంటారో అనే కోణంలో చూపించారు. చిన్న పాయింట్ పరిమిత బడ్జెట్ తో బాగానే తీసినా ఎంటర్ టైన్మెంట్ ఉంటె బాగుండేది. సెకండాఫ్లో మలుపులు బాగున్నాయి. మొదటి భాగంలో కలిగే బోర్ ఫీలింగ్ని తొలగిస్తుంది. ఫైనల్గా వచ్చే ట్విస్ట్ వాహ్ అనేలా ఉంటుంది. కన్క్లూజన్ మాత్రం గుండెని కలచివేస్తుంది. హృదయాన్ని బరువెక్కిస్తుంది. సినిమాలో అండర్లైన్గా సాగే ఎమోషన్స్ క్లైమాక్స్ లో పీక్లోకి వెళ్తుంది. అదే ఈ సినిమాకి ప్రధాన బలం, హైలైట్ పాయింగ్గా చెప్పొచ్చు.
అఖిల్ పాత్రలో త్రినాథ్ వర్మ కొత్త అయినా పాత్రలో జీవించారు. సింపుల్ కుర్రాడిలా కనిపించాడు. ప్రియాగా కనిపించే పాత్రలో భావన సాగి నటన సైతం ఆకట్టుకుంటుంది. మొదట ఓవర్గా అనిపించినా, ఆ తర్వాత ఆ పాత్రనే ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. అఖిల్ ఫ్రెండ్ రేవంత్గా రవితేజ కుర్రాడు ఫర్వాలేదు. ప్రియా ఫ్రెండ్ అసలు ప్రియా పాత్రలో మౌనికా రెడ్డి కాసేపు మెరిసింది. వీరికి కుక్క కూడా తోడయి ఆత్మలకు న్యాయం చేసింది. మొత్తంగా త్రినాథ్ వర్మ, భావన సాగి మెప్పించారు.
దర్శకుడు శ్రవణ్.. కాన్సెప్ట్, టేకింగ్ బాగుంది. ప్రారంభంలో ఎమోషన్స్ క్యారీ కాలేదు. అందుకే బోర్ తెప్పిస్తుంది. గతం చెప్పేటప్పుడు ఆయా సీన్లు చూపిస్తే బాగుండేది. బోర్ ఫీల్ని తగ్గించేది. శశాంక్ సాయి రామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతీక్ అందించిన బాణీలు ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. ఆనంద్ నంబియార్ నేపథ్య సంగీతం మూడ్కు తగ్గట్టుగా వెళ్తుంది. `ప్రేమంటే.. ఒకరు మాత్రమే ప్రేమిస్తే సరిపోదు, మనం ఎవరో తెలియాలంటే.. చుట్టు పక్కలా చూడటం కాదు..వెనక్కి చూస్తే తెలుస్తుంది` అంటూ రైటర్గా శ్రవణ్ రాసిన కొన్ని మాటలు మెప్పిస్తాయి. రైటర్ గా, ఎడిటర్గా దర్శకుడు శ్రవణ్ ఆకట్టుకుంటాడు. విజయ లక్ష్మీ నిర్మాతగా తపనతో నిర్మించినట్టు కనిపిస్తుంది. ఈ సినిమా ఓటిటి ఫార్మేట్ కి సరికొత్త కధ గా ఆదరణపొందుతుంది అనడంలో సందేహమే లేదు.