తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు: నేటితో ముగింపు

శుక్రవారం, 7 అక్టోబరు 2011 (10:32 IST)
తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఎనిమిది రోజుల పాటు.. తనకిష్టమైన వాహన సేవల్లో వివహరించి అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయ ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేకసేవ జరుగుతుంది.

అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రతాళ్వార్‌ను వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రతాళ్వార్ స్నానమాచరించే సమయంలో కోనేరులో స్నానం చేస్తే సకల పాపాలూ నశించి, కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం

చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెప్పడంతో బ్రహ్మోత్సవాలను ముగిస్తారు.

వెబ్దునియా పై చదవండి