బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

ఠాగూర్

సోమవారం, 7 జులై 2025 (11:52 IST)
ప్రపంచస్థాయి సంస్థల్లో వర్ధమాన, వెనుకబడిన దేశాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని మరింత సమ్మిళితంగా, బహుళ ధ్రువ సంస్థలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. 'గ్లోబల్ సౌత్‌గా వ్యవహరిస్తున్న వెనుకబడిన దేశాలకు మరింత ప్రాధాన్యం లభించాల్సి ఉందని తెలిపారు. ఆదివారం బ్రెజిల్‌లోని రియో డి జనైరో నగరంలో జరిగిన 17వ బ్రిక్స్ కూటమి సదస్సులో ఆయన ప్రసంగించారు. 
 
ఈ సదస్సుకు కీలక నేతలైన రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గైర్హాజరు కావడం గమనార్హం. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలు అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు కారణంగా ప్రపంచ స్థాయి సంస్థల్లో గ్లోబల్ సౌత్ దేశాలు బాధితులుగా మిగులుతున్నాయని అభిప్రాయపడ్డారు. 
 
అభివృద్ధి, వనరుల పంపిణీ, భద్రత వంటి విషయాల్లో చిన్నచూపునకు గురవుతున్నాయని తెలిపారు. 20వ శతాబ్దంలో ఏర్పాటయిన ప్రపంచస్థాయి సంస్థల్లో మూడింట రెండో వంతు మానవ జాతికి తగిన ప్రాతినిధ్యమే లేకుండా పోతోందని ఆరోపించారు. "ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఎంతగానే సహకరిస్తున్న దేశాలకు విధాన నిర్ణయాలు తీసుకునే సమయంలో తగిన స్థానం ఉండడం లేదు. 
 
ఇది కేవలం ప్రాతినిధ్యానికి సంబంధించిన సమస్యే కాదు. ఆయా సంస్థల విశ్వసనీయత, సమర్థతకు సంబంధించినది కూడా. గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రాతినిథ్యం లేని సంస్థలను ప్రపంచస్థాయి సంస్థలు అంటే అవి సిమ్ కార్డు ఉండి నెట్ వర్క్ లేని మొబైల్ ఫోన్లు లాంటివి" అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. 
 
ప్రపంచస్థాయి సంస్థ అయిన ఐక్యరాజ్యసమితిపై అభిప్రాయం చెబుతూ అది 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనలేకపోతోందని చెప్పారు. 'ప్రపంచంలో పలుచోట్ల జరుగుతున్న యుద్ధాలు. కరోనా వంటి మహమ్మారులు. ఆర్థిక సంక్షోభం, సైబర్ నేరాలు, అంతరిక్షంలోని సమస్యలకు ఈ సంస్థల వద్ద సమాధానాలు లేవని ప్రధాన్నారు. 
 
నూతన సమ్మిళిత ప్రపంచ వ్యవస్థను నెలకొల్పాలంటే ముందుగా ఇప్పుడున్న ప్రపంచస్థాయి సంస్థలను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. పరిపాలన వ్యవస్థ, ఓటింగ్ హక్కులు, నాయకత్వ స్థానాల్లో మార్పులు ఉండాలన్నారు. బ్రిక్స్‌లో కూడా మరిన్ని దేశాలను కలుపుకోవాలని, కాలానికి తగ్గట్టుగా ఈ కూటమి కూడా మారుతుందని నిరూపించాలని అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు