తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో శనివారం రాత్రి జరిగిన ఐదేళ్ల చిన్నారి హితీక్ష హత్యకు కుటుంబ తగాదాలే కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కుటుంబ తగాదాలు ఉన్న సమీప బంధువైన ఒక మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్థానిక ఆదర్శనగర్ కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి సమీపంలోని ఓ ఇంటి స్నానాల గదిలో విగతజీవిగా కనిపించిన ఘటన విదితమే.
మొదట ఆ ఇంటి యజమానిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతడికి ఫోన్ చేయగా తాను వరంగల్ జిల్లాలో ఉన్నట్లు చెప్పారు. స్థానికంగా ఉన్న వారే హత్యకు పాల్పడి ఉండచ్చన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. శనివారం రాత్రి 11 గంటలకు ఎస్పీ అశోక్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని వేకువజామున 4 గంటల వరకు క్షుణ్ణంగా పరిశీలించారు.
మృతురాలి ఇంటి వద్ద ఉన్న ఓ సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి, పోలీస్ జాగిలాలతో తనిఖీలు జరిపారు. జాగిలాలు ఘటనా స్థలం నుంచి చిన్నారి ఇంటికే వెళ్లి ఆగాయి. సీసీ ఫుటేజీలో చిన్నారి సమీప బంధువైన ఓ మహిళ ఘటన సమయంలో పలుమార్లు ఇంటి నుంచి బయటకు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పైగా, ఆమె మొబైల్ కాల్ డేటా కూడా తొలగించి ఉన్నట్లు సమాచారం.
కుటుంబసభ్యులు హితీక్ష తల్లిని బాగా చూసుకుంటూ తనను పట్టించుకోవడం లేదన్న అక్కసుతోనే చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారి తండ్రి రాము, తాత మదన్ గల్ఫ్లో ఉండగా ఆదివారం సాయంత్రం ఇంటికి చేరుకుని మృతదేహం వద్ద బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.