కేంద్రానికి చంద్రబాబు షాక్... ఏపీలో సీబీఐకు నో ఎంట్రీ

శుక్రవారం, 16 నవంబరు 2018 (14:19 IST)
కేంద్ర ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతకైనా తెగించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోడీతో తలపడేందుకు కాలు దువ్వుతున్నారు. ఇందులోభాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశ అత్యున్నత నేర దర్యాప్తు సంస్థ సీబీఐకు ఏపీలో అడుగు పెట్టకుండా చర్యలు తీసుకున్నారు. 
 
సీబీఐకు అనుమతించిన కన్సెంట్‌ను విరమించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫలితంగా సీబీఐపై ఏపీ సర్కారు కన్నెర్రజేసినట్టయింది. ఈ ఉత్తర్వులతో రాష్ట్రంలో సీబీఐ అనుమతి లేకుండా అడుగు పెట్టడానికి వీల్లేదు. తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో సీబీఐ ఎటువంటి సోదాలు కానీ, దర్యాప్తు కానీ చేసే అధికారాన్ని కోల్పోయినట్టే. 
 
ఏదేని రాష్ట్రంలో సీబీఐ విచారణ చేయాలన్నా, కేసులు పెట్టాలన్నా ఆ రాష్ట్ర అనుమతి తప్పనిసరి. ఈ విషయంలో దేశ రాజధాని ఢిల్లీకి మినహాయింపు ఉంది. కానీ, చంద్రబాబు సర్కారు తాజాగా జారీచేసిన ఆదేశాలతో రాష్ట్రంలో సీబీఐ కేంద్ర ప్రభుత్వ శాఖల్లోగానీ ఇతర కేంద్ర పబ్లిక్ సెక్టార్ సంస్థల్లోగానీ ఎలాంటి విచారణ చేయడానికి అర్హత లేదు. 
 
ఇటీవల రాష్ట్రంలో పలుచోట్ల సీబీఐ దాడులు నిర్వహించి, వ్యాపారస్థుల, రాజకీయ నాయకుల వెన్నులో వణుకు పుట్టించిన సంగతి తెలిసిందే. దీనికితోడు రాష్ట్ర సర్కారు కేంద్రంతో అమీతుమీకి దిగిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కేంద్రానికి చురకలాంటిదని భావించవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు