ఆంధ్రా బ్యాంకుకి పంగనామం... రూ. 5 వేల కోట్లు ఎగనామం...

సోమవారం, 24 సెప్టెంబరు 2018 (18:45 IST)
పెడతా పెడతా నామం పెడుతా... ఈ పాటను వినే వుంటారు. ఇప్పుడు మన దేశంలో బ్యాంకులకు నామాలు పెట్టి పారిపోయేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకవైపు పెట్రోలు ధరలతో ప్రభుత్వాలు సామాన్యుడి నెత్తిపై వీర బాదుడు బాదుతుంటే అపర కుబేరులు మాత్రం చక్కగా కోట్లకు కోట్లు కాజేసి ఎగనామం పెట్టి డబ్బు సంచులతో పారిపోతున్నారు. తాజాగా మరో విజయమాల్యా ఆంధ్రా బ్యాంకుకి పంగనామం పెట్టేసి చెక్కేశాడు. 
 
వివరాల్లోకి వెళితే... ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలోని కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణం తీసుకున్న స్టెర్లింగ్ బయోటెక్ అధినేత నితిన్ సందేశర ఆ బ్యాంకుకి చక్కగా సున్నం బొట్లు పెట్టేశాడు. చెప్పా పెట్టకుండా భారత్ నుంచి నైజీరియాకు చెక్కేశాడు. ఐతే అతడి పైన సీబీఐతో పాటు ఈడీ కేసులున్నా అతగాడు చల్లగా ఎలా జారుకున్నాడన్నది చర్చనీయాంశంగా మారింది. ఇతగాడు నైజీరియాకు జారుకునేందుకు సహకరించిన పెద్దలెవరన్నది ఇప్పుడు తేలాల్సిన విషయంగా వుంది. 
 
గుజరాత్ రాష్ట్రానికి చెందిన స్టెర్లింగ్ బయోటెక్ కోటానుకోట్ల రుణాలు తీసుకుంది. ఐతే తీసుకున్న డబ్బును చెల్లించడంలో మాత్రం మొండిచేయి చూపింది. దీనితో బ్యాంకులు అతడిపై సీబీఐకి ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో అతడిపైన కేసులు నమోదు చేశాయి సీబీఐ, ఈడీ. కేవలం కాగితాల మీదున్న 300 డొల్ల కంపెనీల ద్వారా ఈ బాబు బ్యాంకుల నుంచి తీసుకున్న సొమ్ము రూ.5,383 కోట్లు.

ఇందులో ఇప్పటికే రూ. 4,700 కోట్లు విలువైన స్టెర్టింగ్ బయోటెక్ ఆస్తులను జప్తు చేసుకున్నారు కానీ మిగిలిన డబ్బును రాబట్టే క్రమంలో ఇతగాడు కుటుంబంతో సహా పరారయ్యాడు. అతడిని అక్కడి నుంచి రప్పించడం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇంటర్ పోల్ సహాయంతో వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ అదంత ఈజీ కాదని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు