కర్నూలులో హస్తానికి బీటలు.. సైకిలెక్కనున్న 'కోట్ల' - కడప వైకాపాలో లుకలుకలు

సోమవారం, 28 జనవరి 2019 (13:51 IST)
కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. జిల్లాలో పార్టీకి ఆయుపట్టుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి హస్తానికి హ్యాండివ్వనున్నారు. ఆయన దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఇదే విషయంపై చర్చించేందుకు సోమవారం రాత్రి టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై చర్చలు జరుపనున్నారు. 
 
కాగా, ఇప్పటికే కోట్ల అనుచరులు అనేక మంది తమతమ పదవులకు రాజీమానా చేసిన విషయం తెల్సిందే. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతల ఉన్నత స్థాయి సమావేశంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయాలని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రతిపాదించారు. దీనికి ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జులు అంగీకరించలేదు. ఇప్పటికే టీడీపీ - కాంగ్రెస్ పొత్తు సఫలంకానందున ఏపీలో వద్దనే వద్దని తేల్చి చెప్పారు. దీనికి కినుకు వహించిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు నిర్ణయించుకున్నారు.
 
మరోవైపు, ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కడప జిల్లా కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఇవి పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారాయి. పలుకుబడి కలిగిన పలువురు నేతలు అసెంబ్లీ టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. తమకు టిక్కెట్ దక్కని ఓ నిర్ణయానికి వస్తే మాత్రం వారు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జమ్మలమడుగు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని అల్లె ప్రభావతి ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు