అణ్వాయుధం కంటో కరోనాతోనే అపార నష్టం : ఆనంద్ మహీంద్రా

మంగళవారం, 1 జూన్ 2021 (14:07 IST)
ఎపుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దేశానికి కరోనా వైరస్ కలిగిస్తున్న నష్టంపై ఆందోళన వ్యక్తం చేశారు. అణ్వాయుధాలతో కలిగే నష్టం కంటే.. కరోనా వైరస్ కారణంగా కలిగిన నష్టమే అధికంగా ఉందన్నారు. 
 
'కరోనా చైనా శాస్త్రవేత్తల సృష్టే' అనే మీడియా కథనాన్ని కూడా ఆయన షేర్ చేస్తూ, కరోనా ఎక్కడ పుట్టిందనే విషయాన్ని మనం ఎప్పటికీ తెలుసుకోలేమన్నారు. ప్రస్తత పరిస్థితుల్లో అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం మాదిరిగానే... జీవాయుధాలు, ప్రమాదకర పరిశోధనల నిరోధక ఒప్పందాన్ని కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 
 
కరోనా పుట్టి ఏడాదికి పైగా సమయం గడిచిపోయిందని... అయినప్పటికీ ఇంతవరకు మనం దాని మూలాలను కనుక్కోలేకపోయామని బ్రిటన్ పత్రిక 'డైలీ మెయిల్' తెలిపింది. సార్స్ కోవ్-2 వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలే కృత్రిమంగా సృష్టించారని బ్రిటీష్ ప్రొఫెసర్ అంగూస్ డాల్ గ్లిష్, నార్వే సైంటిస్ట్ బర్గర్ సొరెన్ సెన్ తమ నివేదికలో పేర్కొన్నారని వెల్లడించింది. 
 
దీన్ని ల్యాబ్‌లోనే పుట్టించారని చెప్పడానికి అవసరమైన ప్రత్యేక సంకేతాలను కూడా తాము గుర్తించామని వారు చెప్పినట్టు తెలిపింది. మరికొన్ని రోజుల్లో ఈ పూర్తి నివేదిక సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితం కానుంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 36 లక్షల మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ప్రాణనష్టం జరిగిన దేశాల్లో అమెరికా, భారత్‌లో అధికంగా ఉన్నాయన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు