డిసెంబరు ఆఖరుకు కరోనా వ్యాక్సిన్... ఎమర్జెన్సీ వినియోగం కింద పంపిణీ : రణ్‌దీప్

శుక్రవారం, 4 డిశెంబరు 2020 (07:53 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఈ నెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తుందని అఖిల భారత వైద్య పరిశోధనా కేంద్రం (ఎయిమ్స్) సంచాలకులు డాక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ వినియోగం కింద దీన్ని పంపిణీ చేస్తామని తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కరోనా టీకా పరీక్షలు దాదాపు తుది దశకు చేరుకోవడంతో ఈ నెలాఖరు, లేదంటే వచ్చే నెల ప్రారంభంలో టీకా అందుబాటులోకి వస్తుందన్నారు. అత్యవసర వినియోగానికి అనుమతులు లభించిన వెంటనే పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. 
 
వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని భద్రపరిచేందుకు అవసరమైన ఉష్ణోగ్రతలు, స్థలం, వ్యాక్సిన్ ఇచ్చే వారికి శిక్షణ, సిరంజిల లభ్యత వంటి వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు ప్రారంభించినట్టు చెప్పారు.
 
చెన్నైలో వ్యాక్సిన్ పరీక్షలో పాల్గొన్న ఓ వలంటీర్ అనారోగ్యానికి గురైనట్టు వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ, ఓ మహమ్మారిని అరికట్టేందుకు చేస్తున్న టీకాల ప్రయోగాల్లో కొన్నిసార్లు అపశ్రుతులు జరగడం సహజమేనని తెలిపారు. 
 
ఆ చెన్నై వాలంటీర్‌కు వేరే కారణాల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తి ఉండొచ్చని, టీకా వల్ల అయి ఉండదని అన్నారు. ఇప్పటివరకు దాదాపు 80 వేల మంది వలంటీర్లకు టీకా ఇచ్చినా ఎవరిలోనూ ఎటువంటి సమస్యలు ఎదురు కాలేదని ఆయన గుర్తుచేశారు. 
 
అయితే, ఏదైనా వ్యాక్సిన్‌ను సుదీర్ఘకాలంపాటు తీసుకుంటే మాత్రం సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు చెప్పిన డాక్టర్ గులేరియా.. మరో మూడు నెలల్లో పెద్ద మార్పు కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు