ఎగ్జిట్ పోల్స్ : మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ .. తెలంగాణాలో టీఆర్ఎస్

శుక్రవారం, 7 డిశెంబరు 2018 (17:53 IST)
రానున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా పరగణించిన అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడయ్యాయి. శుక్రవారం సాయంత్రం పోలింగ్‌ ముగిసిన అనంతరం వెల్లడైన ఎగ్జిట్‌ పోల్స్‌ వివరాలిలా ఉన్నాయి. టైమ్స్ నౌ సర్వే ప్రకారం మొత్తం 230 సీట్లున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 89, బీజేపీకి 126, బీఎస్పీకి 6 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇండియా సర్వే నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 104 నుంచి 122 సీట్లు, బీజేపీకి 102 నుంచి 120 సీట్లు దక్కుతాయని వెల్లడించింది. 
 
అలాగే, టైమ్స్ నౌ సర్వే వెల్లడించిన ఫలితాల మేరకు మొత్తం 119 సీట్లున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు 66, ప్రజా కూటమికి 37, బీజేపీకి 7, ఇతరులకు 9 చొప్పున వస్తాయని తెలిపింది.

రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని టైమ్స్ నౌ వెల్లడించింది. మొత్తం 200 సీట్లున్న రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకి 105, బీజేపీకి 85, బీఎస్పీకి 2, ఇతరులకు ఏడు స్థానాలు దక్కవచ్చని పేర్కొంది. 

అలాగే, 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజేపీకి 46, కాంగ్రెస్ పార్టీకి 35, ఇతరులకు 9 స్థానాలు వస్తాయని పేర్కొంది. 
 
ఇకపోతే, తెలంగాణలో పోలింగ్‌ ముగిసిన తర్వాత మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ రాత్రి 7గంటలకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల సర్వే ఫలితాలను ఆయన వెల్లడించనున్నారు. 
 
తెలంగాణలో పోలింగ్‌ సరళిని బట్టే ఫలితాలు ఉంటాయని, 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారంటూ ఇటీవల లగడపాటి జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. పూర్తి సర్వే ఫలితాలను ఆయన ఈ రోజు వెల్లడిస్తానని ఇది వరకే ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు