దర్శకుడు మణిరత్నంపై దేశద్రోహం కేసు

శుక్రవారం, 4 అక్టోబరు 2019 (15:49 IST)
సినీ దర్శకుడు మణిరత్నంపై దేశద్రోహం కేసు నమోదైంది. ఆయనతో పాటు 49 మందిపై ఇదే తరహా కేసు బీహార్ రాష్ట్రంలో నమోదైంది. గతంలో దేశ వ్యాప్తంగా మైనార్టీలు, దళితులు, క్రైస్తవులపై మూకదాడులు జరిగాయి. వీటిపై పలువురు సినీ సెలెబ్రిటీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మణిరత్నంతో సహా 49 మంది సినీ ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. ఇదే అంశంపై ఇపుడు ముజఫర్‌పూరులో కేసు నమోదైంది. 
 
వీరిపై దేశద్రోహ ఆరోపణలతో కేసును నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో సినీ దర్శకుడు మణిరత్నం, రామచంద్ర గుహ, అపర్ణా సేన్, శ్యామ్ బెనగళ్, అనురాగ్ కశ్యప్, సౌమిత్ర ఛటర్జీ తదితరులు ఉన్నారు. ముస్లింలు, దళితులు, ఇతర మైనార్టీలపై మూక హత్యలను వెంటనే ఆపాలని వీరు లేఖలో పేర్కొన్నారు. అసమ్మతి లేకుండా ప్రజాస్వామ్యం ఉండదని తెలిపారు. జై శ్రీరాం నినాదాన్ని రెచ్చగొట్టేందుకు ఉపయోగించే స్థాయికి దిగజార్చారని మండిపడ్డారు.
 
అయితే, ఈ లేఖపై స్థానిక న్యాయవాది సుధీర్ కుమార్ ఓఝా ముజఫర్ పూర్ కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ వీరందరిపై కేసు నమోదు చేయాలని రెండు నెలల క్రితం ఆదేశాలు జారీ చేచేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు