ప్రతి భారతీయుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా : ప్రధాని మోడీ

శనివారం, 26 మే 2018 (12:52 IST)
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటైంది. ఆ కూటమి తరపున ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. అంటే 2014లో సరిగ్గా ఇదే రోజున భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలనుద్దేశించి మోడీ వరుస ట్వీట్లు చేశారు.
 
'2014 ఇదే రోజున, భారత్‌లో మార్పు తీసుకురావడం కోసం మా ప్రయాణం ప్రారంభమైంది. గత నాలుగేళ్లుగా, అభివృద్ధి అనే అంశం సామూహిక ఉద్యమమై ప్రతిధ్వనిస్తోంది. దేశాభివృద్ధి కోసం ప్రతి భారతీయుడు ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటున్నాడు. 125 కోట్ల మంది భారతీయులు భారత్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళుతున్నారు. మా ప్రభుత్వంపై అపారమైన నమ్మకం ఉంచిన ప్రతి భారతీయుడికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. 
 
ఈ మద్దతు, వారు చూపించే ప్రేమే ప్రభుత్వానికి అతిపెద్ద వనరు. అంతేకాదు, ప్రభుత్వానికి ప్రేరణ, శక్తీ కూడా. అంతే ఉత్సాహం, శక్తి సామర్థ్యాలు, అంకిత భావంతో భారత ప్రజలకు మా సేవలను కొనసాగిస్తాం. స్థిర చిత్తం, నైతిక సూత్రాలకు కట్టుబడి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలే నవభారత్‌కు పునాదిరాళ్లు అంటూ మోడీ ట్వీట్ చేశారు. 
 
మున్ముందు కూడా అదే అకుంఠిత దీక్షతో ప్రజాసేవకు అంకితమవుతామన్నారు. మాకు ఎప్పటికీ ఇండియానే ఫస్ట్ అని, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా.. ప్రజా ఉపయోగకరమైన పథకాలను చేపట్టామని ప్రధాని నరేంద్ర మోడీ తన ట్వీట్లలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు