నన్ను కవ్విస్తే జగన్ అసలు స్వరూపం బయటపెడతా: గోనె ప్రకాష్ రావు

శుక్రవారం, 18 జూన్ 2021 (18:11 IST)
ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్టీసీ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు. జగన్ గురించి ఎక్కడ మాట్లాడటానికైనా తాను సిద్థంగా ఉన్నానన్నారు. జగన్ చేతకాని పరిపాలనను ప్రశ్నిస్తే కక్ష కడతారా అంటూ ధ్వజమెత్తారు. ఎపిలో పచ్చ మీడియా ఏదో ప్రజలందరికీ తెలుసునన్నారు.
 
జగన్ త్వరలో జైలుకెళ్ళడం ఖామని.. బెయిల్ ఖచ్చితంగా రద్దవుతుందన్నారు. జగన్ అభిమానులు తనను బెదిరిస్తున్నారని.. తనను కవ్విస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తనకు దమ్ముందని.. ఎక్కడైనా జగన్ గురించి మాట్లాడతానన్నారు. తెలంగాణాలో కాదు ఆంధ్రలో ప్రెస్ మీట్ పెట్టగలవా అంటూ వైసిపి అభిమానులు సవాల్ విసిరారన్నారు.
 
అందుకే ఆంధ్రలో.. తిరుపతిలో మొదటి ప్రెస్ మీట్ పెట్టానని.. పులివెందులలో కూడా ప్రెస్ మీట్ పెట్టగలనన్నారు. కొన్ని టివి ఛానళ్లపై కక్ష కట్టి కేసులు పెట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. నాలో, నాతో వైఎస్ఆర్ పుస్తకంలో అన్నీ అబద్ధాలే రాశారని.. వై.ఎస్.విజయమ్మ ఉన్నవి.. లేనివి పుస్తకంలో రాసిందన్నారు. 
 
వైఎస్ఆర్ పాదయాత్రలో ఎప్పుడూ జగన్ పాల్గొనలేదని.. జగన్ పాదయాత్రలో ఉన్నాడని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానన్నారు. సజ్జల రామక్రిష్ణారెడ్డి, ఆళ్ళ రామక్రిష్ణారెడ్డిలు ఇద్దరూ బ్రోకర్లు అంటూ మండిపడ్డారు. విజయసాయిరెడ్డి ఫైనాన్స్ బ్రోకర్ అంటూ ధ్వజమెత్తారు. వై.ఎస్. వివేకానందరెడ్డిని హత్య చేసింది కుటుంబ సభ్యులేనని.. అందులో కీలక సూత్రధారి అవినాష్ రెడ్డేనన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు