ఏపీ జాబ్ క్యాలెండర్ : విడుద‌ల చేయనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

శుక్రవారం, 18 జూన్ 2021 (11:25 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇవాళ జాబ్ క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. 2021-22లో వివిధ శాఖ‌ల్లో భ‌ర్తీ చేయ‌నున్న పోస్టుల వివ‌రాల‌ను వెల్లడించనున్నారు. ఉద్యోగాల ఖాళీలు ప్రకటించి, వాటిని క్ర‌మంగా భర్తీ చేయనున్నారు. విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ప్ర‌భుత్వం అత్యధిక ప్రాధాన్య‌త ఇస్తోంది.
 
అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేప‌ట్టాల‌ని.. అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేప‌ట్టాల‌ని ప‌లు సంద‌ర్భాల్లో సీఎం వైఎస్ జ‌గ‌న్ ఆదేశించారు. మొత్తంగా 10,143 ఉద్యోగాల భ‌ర్తీకి క్యాలెండ‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు సీఎం వైఎస్ జ‌గ‌న్. 
 
ఇక‌, ఆ వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే.. ఎస్సీ ఎస్టీ డీఏ బ్యాక్‌లాగ్‌ 1,238 పోస్టులు, ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, గ్రూప్ 2లో 36 పోస్టులు, పోలీస్‌ శాఖలో 450 ఉద్యోగాలు, వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 451 పోస్టులు, పారామెడికల్‌ సిబ్బంది 5,251 పోస్టులు, నర్సులు 441 పోస్టులు, డిగ్రీ కాలేజీల లెక్చరర్లు 240 పోస్టులు, వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 2,000 పోస్టులు, ఇతర శాఖలల్లో 36 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు.. ఈ ఏడాది జులై నుంచి వ‌చ్చే ఏడాది మార్చి వ‌ర‌కు వివిధ ద‌శ‌ల్లో పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు