యుద్ధానికి దిగితే ఫలితం సరిహద్దులు దాటి వుంటుంది: పేట్రేగిన ఇమ్రాన్ ఖాన్

శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (22:32 IST)
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన మాటలతో మరోసారి ఐకాస వేదికగా పేట్రేగిపోయారు. అణ్వాయుధాలను కలిగిన తమ దేశం యుద్ధానికి దిగితే ఫలితం సరిహద్దులను దాటి వుంటుందంటూ హెచ్చరికలు చేశారు. ఇదేదో వార్నింగ్ కాదంటూనే హెచ్చరిక లాంటిది చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ... ఆయన ఆర్ఎస్ఎస్ సభ్యుడని అన్నారు.
 
ఆరెస్సెస్ అడల్ఫ్ హిట్లర్, బెనిటో ముస్సోలినీ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని పురుడు పోసుకున్నదంటూ చెప్పుకొచ్చారు. ముస్లింలను భారతదేశంలో లేకుండా చేయాలన్నదే ఈ సంస్థ లక్ష్యమనీ, ఆ ద్వేషంతోనే గాంధీజీని హత్య చేశారంటూ ఆరోపించారు. ముస్లింలకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం సాగుతోందనీ, కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై వినిపించేందుకే ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు.
 
తాము కశ్మీరులోకి ఉగ్రవాదులను ఎందుకు పంపుతామంటూ ప్రశ్నించారు. ముస్లిం అంటేనే ఉగ్రవాదులు అని ముద్ర వేస్తున్నారనీ, హిందువులు కూడా ఉగ్రవాద చర్యలకు పాల్పడిన ఘటనలు ఎన్నో వున్నాయన్నారు. మరి వారిని మాత్రం అలా అనడం లేదని చెప్పారు. మొత్తమ్మీద కశ్మీర్ అంశాన్ని ఐకాస జోక్యం చేసుకోవాలన్న కోణంలో ఆయన ప్రసంగం సాగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు