మరో నెల రోజుల్లో 5.5 లక్షలకు చేరనున్న పాజిటివ్ కేసులు

సోమవారం, 11 మే 2020 (11:03 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 67 వేలకు పెరిగిపోయాయి. 
 
ఈ పరిస్థితుల్లో మున్ముందు దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఏ విధంగా ఉండబోతుందన్న అంశంపై సింగపూర్ దేశానికి చెందిన డూక్ - నుజ్ మెడికల్ స్కూల్, గౌహతి ఐఐటీలు సంయుక్తంగా ఓ సర్వే నిర్వహించాయి. ఇందులో దేశంలో వైరస్ వ్యాప్తి అంచనాలు అనే అంశాన్ని ప్రధానగా చేసుకుని ఈ సర్వే నిర్వహించారు. 
 
ఇందులో వచ్చే నెల రోజుల వ్యవధిలో దేశంలో కనీసం లక్షన్నర కరోనా కేసులు నమోదవుతాయని అంచనా వేశారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో కేసుల నమోదును పరిశీలించి వైరస్ వ్యాప్తిపై లెక్కలు గట్టారు. రానున్న నెల రోజుల్లో కనీసం 1.50 లక్షలు, వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటే గరిష్టంగా 5.5 లక్షల కేసులు నమోదు కావచ్చని అంచనా వేశారు.
 
గడచిన రెండు వారాల వ్యవధిలో కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గని రాష్ట్రాలను ఓ భాగంగా, కేసులు తగ్గుతున్న రాష్ట్రాలను మరో భాగంగా, యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్న రాష్ట్రాలను మరో భాగంగా తీసుకుని ఈ అంచనాను రూపొందించినట్టు గౌహతి ఐఐటీ బృందం తెలిపింది. 
 
రాష్ట్రాల వారీగా కేసుల పెరుగుదల, వైరస్ వ్యాప్తిపై ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు భిన్నంగా ఉండటంతో, కేసుల అంచనా విషయంలో దేశమంతటినీ ఒకే విధంగా భావించకుండా, మూడు భాగాలు చేశామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు