భారత్‌లోకి ఐఎస్ఐ ఏజెంట్లు.. దేశ వ్యాప్తంగా హైఅలెర్ట్

మంగళవారం, 20 ఆగస్టు 2019 (11:09 IST)
భారత్‌లోకి ఐఎస్ఐ ఏజెంట్లు చొరబడ్డారని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దేశ వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించాయి. దేశంలో విధ్వంసం సృష్టించే అవకాశాలు ఉన్నాయని అందువల్ల అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. 
 
ఈ ఇద్దరు ఏజెంట్లూ ఆప్ఘనిస్థాన్ పాస్ పోర్టుపై రాజస్థాన్-గుజరాత్ రాష్ట్రాల సరిహద్దుల మీదుగా దేశంలోకి చొరబడినట్టు నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వానికి సమాచారం అందింది. దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
దీంతో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దులతోపాటు ఇతర ప్రాంతాల్లోని హోటళ్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాజస్థాన్‌లోని సిరోహి జిల్లా ఎస్పీ కల్యాణ్ మల్ మీనా అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. 
 
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలని, అటువంటి వారిపై నిఘా పెట్టాలని సూచించారు. అలాగే, దేశంలోని ముఖ్య నగరాల్లో కూడా భద్రతను అప్రమత్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు