కరుణ మృతితో పెరిగిన సానుభూతి.. వచ్చే ఎన్నికల్లో డీఎంకే క్లీన్‌స్వీప్ ఖాయమా?

శుక్రవారం, 10 ఆగస్టు 2018 (12:16 IST)
ద్రవిడ ఉద్యమ నేత, డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతితో దేశవ్యాప్తంగా సానుభూతి పెరుగుతోంది. ఈ సానుభూతి వచ్చే ఎన్నికల్లో డీఎంకేకు ఓట్ల రూపంలో లబ్ధి చేకూర్చనుందని రాజకీయ విశ్లేషకులు అపుడే అభిప్రాయపడుతున్నారు.
 
ఈనెల 7వ తేజీ సాయంత్రం చనిపోయిన కరుణానిధికి.. అంత్యక్రియలు 8వ తేదీ బుధవారం నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో జాతీయ నేతలంతా తరలివచ్చారు. ఫలితంగానే డీఎంకేవైపు సానుభూతి పవనాలు వీస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి సానుభూతి మరింత పెరిగి డీఎంకేకు మేలుచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
 
దీనికి కారణాలు లేకపోలేదనీ వారు విశ్లేషిస్తున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతి తర్వాత ఆ పార్టీని నడిపించేందుకు సరైన నేత కనిపించలేదు. ఇది కూడా డీఎంకేకు కలిసిరానుంది. పైగా, విభేదాల మధ్య ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పళనిస్వామి, పన్నీరు సెల్వానికి ప్రజల మద్దతు ఏమాత్రం లేదనే చెప్పొచ్చు. కేవలం ఎమ్మెల్యేల సంఖ్యాబలంతోనే వారు ప్రభుత్వంలో కొనసాగుతున్నారనది జగమెరిగిన సత్యం. 
 
అదేసమయంలో కరుణానిధి వారసుడిగా స్టాలిన్ కొనసాగే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక నామమాత్రమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీ బేరీజు వేసిన తర్వాతనే డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్‌ను మచ్చిక చేసుకునేందుకు జాతీయ పార్టీలు ప్రయత్నించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు