ఆంధ్రాలో మావోయిస్టుల ఘాతుకం.. కాల్పుల్లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మృతి

ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (13:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఆదివారం విశాఖ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలు మృతిచెందారు. ఎమ్మెల్యే కిడారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఇటీవలే చేరారు.
 
నిజానికి ఎమ్మెల్యే కిడారికి మావోయిస్టులు పలుమార్లు బహిరంగ హెచ్చరికలు చేశారు. కానీ, ఆయన వాటిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం డుంబ్రీగూడ మండలం తొట్టంగి గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమానికి ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, ఇతర అధికారులు వెళ్లిన సమయంలో మావోయిస్టులు లిప్పిటిపుట్ట వద్ద ఈ కాల్పులు జరిపారు. 
 
ఈ కాల్పుల్లో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే సోమ కూడా చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు... జిల్లా ఎస్పీతో సహా పోలీసులు అక్కడకు బయలుదేరారు. మావోయిస్టుల కాల్పులతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. మన్యం ప్రాంతాల్లో ఉండే ప్రజా ప్రతినిధులకు పోలీసు భద్రతను కల్పించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు