అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి...

ఆదివారం, 8 జులై 2018 (09:59 IST)
అమెరికాలో మరోమారు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తెలుగు విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విద్యార్థి పేరు శరత్ కొప్పు. వయసు 26 యేళ్లు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా కొత్తవాడ వాసవీ కాలనీవాసిగా గుర్తించారు.
 
అమెరికాలోని కేన్సస్ సిటీలోని యూనివర్శిటీ ఆఫ్ మిస్సోరిలో ఎమ్మెస్ చేస్తున్న శరత్ తన స్నేహితులతో కలిసి శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో స్థానికంగా ఉండే ఓ రెస్టారెంట్‌కు డిన్నర్‌కి వెళ్లాడు. ఆ సమయంలో రెస్టారెంట్‌కు వచ్చిన ఓ దుండగుడు అక్కడున్న వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. 
 
ఈ కాల్పులు జరిపే సమయంలో అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన శరత్‌పై దుండగుడు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులోపడిన శరత్‌ను అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
శరత్ మృతితో వారి కుటుంబం తీవ్రవిషాదంలో ఉంది. వాసవీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన శరత్ హైటెక్ సిటీలోని సెగాసిస్టం వరల్డ్ వైడ్ కంపెనీలో కొంతకాలం జాబ్ చేశారు. అయితే ఉన్నత విద్య కోసం జనవరి-2018లో అమెరికా వెళ్లాడు. శరత్‌పై కాల్పులు జరిపింది ఓ నల్లజాతీయుడిగా పోలీసులు గుర్తించారు. అనుమానితుడి వీడియో ఫుటేజీని విడుదల చేశారు. శరత్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు