జగన్ - చిరంజీవి లంచ్ మీటింగ్... భేటీ వెనుక ఆంతర్యమిదేనా?

సోమవారం, 14 అక్టోబరు 2019 (19:00 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి - మెగాస్టార్ చిరంజీవిల మధ్య సోమవారం లంచ్ మీటింగ్ జరిగింది. ఇందుకోసం ప్రత్యక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న చిరంజీవి దంపతులు... ఆ తర్వాత విజయవాడలోని తన సోదరుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చారు. అక్కడ నుంచి జగన్ నివాసానికి చేరుకున్నారు. 
 
అక్కడ చిరంజీవి దంపతులకు సీఎం జగన్ దంపతులు సాదరస్వాగతం ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్‌ను మెగాస్టార్ శాలువా కప్పి సన్మానించారు. ఆ తర్వాత వారంతా కలిసి భోజనం చేశారు. ఈ లంచ్ మీటింగ్‌లో సైరా నరసింహా రెడ్డితో పాటు.. తాజా రాజకీయ పరిస్థితులపై వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, 'సైరా నరసింహా రెడ్డి' చిత్రాన్ని వీక్షించాలని జగన్ దంపతులకు చిరంజీవి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఇందుకోసం ప్రత్యేక షో ప్రదర్శించేందుకు చిరంజీవి ఏర్పాట్లు కూడా చేస్తానని హామీ ఇచ్చారట. అయితే, జగన్ సీఎం అయిన తర్వాత మొదటిసారిగా చిరంజీవి భేటీ కావడంతో రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. 
 
అయితే సైరా మూవీ వినోద పన్నుపై జగన్‌తో చిరంజీవి చర్చించినట్లు సమాచారం. ఇక రాజకీయ అంశాలపై కూడా వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీలోని కాపు నేతలను వైసీపీ అనుకూలంగా మలుచుకునే విషయంపై కూడా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాపు సామాజిక వర్గాన్ని వైసీపీకి చేరువగా చేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్, చిరంజీవి భేటీపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ భేటీకి సంబంధించిన పూర్తి అంశాలపై మాత్రం ఏ ఒక్కరూ పెదవి విప్పలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు