ఏపీని వీడి 'సింగపూర్' వెళ్లిపోవడం శరాఘాతం : చంద్రబాబు

బుధవారం, 13 నవంబరు 2019 (15:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ పాలనాతీరుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టు నుంచి సింగపూర్ కన్సార్టియం వెళ్లిపోవడం ఏపీ అభివృద్ధికి శరాఘాతమని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఇసుక  సమస్యపై గురువారం చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు బుధవారం తమ నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపడుతున్నానని అన్నారు. ఐదు నెలల్లో 45 మంది కార్మికుల ఆత్మహత్యలు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేవని విమర్శించారు. ఇసుక కృత్రిమ కొరతను వైసీపీ నేతలే సృష్టించారని చంద్రబాబు అన్నారు. 
 
రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని, పోలవరం ప్రాజెక్టు పనులను కూడా నిలిపివేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ఏపీకి తీరని నష్టమని, రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుతున్నారన్నారు. ఇష్టానుసారం నిరంకుశ ధోరణితో ప్రవర్తిస్తున్నారని, ప్రజా కంటక పార్టీగా వైసీపీ మారిందన్నారు. ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి పోరాడతామని అన్నారు. 
 
మరోవైపు, ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం 12 గంటల పాటు 'ఇసుక దీక్ష'ను చేపట్టనున్న నేపథ్యంలో ఈ రోజు విజయవాడలోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాసానికి టీడీపీ నేతలు వెళ్లి చర్చించారు. ఆయనతో చర్చించిన అనంతరం టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య వివరాలు తెలిపారు. చంద్రబాబు దీక్షకు పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారని అన్నారు.
 
ఏపీలో ఇసుక కొరత కారణంగా ఇప్పటివరకు 45 మంది ఆత్మహత్య చేసుకున్నారని వర్ల రామయ్య అన్నారు. ప్రభుత్వ తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇసుక కొరత కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందజేసిందని, ఆ విధానాన్నే జగన్ ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. తమ దీక్షకు మద్దతు తెలిపిన పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు